తెలంగాణ ఉద్యమ సమయంలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న వ్యక్తి కోదండరాం. జేఏసీ ఛైర్మన్గా కేసీఆర్తో సహా ఆయన ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్, కోదండరాంల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కేసీఆర్తో జట్టువీడి ప్రజా పోరాటాల కోసం జేఏసీ ఛైర్మన్గానే కొనసాగుతూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆయన కేసీఆర్కు కంట్లో నలుసులా తయారయ్యారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదని, ఉద్యోగ నియామకాలు లేవు, రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు, యూనివర్సీటీల్లో నియామకాలు లేవంటూ అనేక అంశాలపై ఆయన పోరు బాట పట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ప్రజలకు దూరమవుతూ వచ్చారు.
తెలంగాణలో ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు:కోదండరాం
రాష్ట్ర చరిత్రలో ప్రజలను ఇంత దారుణ పరిస్థితిలో ఎప్పుడు చూడలేదని కోదండరాం అంటున్నారు. ప్రైవేటు టీచర్లు ఉద్యోగాలు లేక రోడ్లపాలయ్యారని.. ధాన్యం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని.. కేసీఆర్ హామీ మేరకు నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందంటూ గత రెండేళ్ళుగా యువత చూస్తోందని .. కేసీఆర్ ఇవేమి పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజలను అవమాన పరుస్తున్నారంటూ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా తయారైనా కేసీఆర్ కనీసం పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పర్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని … సమీక్షలు కేవలం ప్రకటనల కోసం మాత్రమే అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటున్నారు. కేసీఆర్ ఏక పక్ష ధోరణిని ఎండగట్టేందుకు మరో సారి ఉద్యమ బాట పట్టాల్సిందే అంటున్నారు .
48 గంటల దీక్షకు సిద్థం..
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందంటూ.. వారిని మేల్కొలిపేందుకు 48 గంటల దీక్ష చేపట్టబోతున్నారు కోదండరాం. వచ్చే ఏడాది జనవరి 3,4వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, ఎల్ఆర్ఎస్ రద్దు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం, ప్రైవేటు స్కూళ్లకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ 48 గంటల నిరాహార దీక్షనే కాకుండా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి చాలా రోజుల తరువాత కోదండరాం మరోమారు ఉద్యమ పంథా ఎంచుకోవడంతో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.. ప్రభుత్వం కోదండరాం 48గంటల దీక్షకు ప్రభుత్వం దిగివస్తుందా… భవిష్యత్లో కోదండరాం అనుసరించే వ్యూహాలేంటన్నది వేచి చూడాలి.