తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు మేలు చేయబోయిన వైఎస్ఆర్ సీపీ.. ఘోరంగా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు ఎన్నికల్లో మేలు జరగడానికి ఆడిన నాగార్జున సాగర్ నాటకం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండి అందించిన సహకారం బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా చేటు చేశాయి. పైగా ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి.. కేసీఆర్ కు జగన్ బాగా నష్టం చేశారు. అసలు దూరదృష్టి, భవిష్యత్తు పరిణామాల గురించి ఆలోచించని జగన్.. సహజంగానే చంద్రబాబు ఎఫెక్ట్ ని తెలంగాణలో ఊహించి ఉండరు. మొత్తానికి వైఎస్ఆర్ సీపీ వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతేకాక, తెలంగాణ ఎన్నికల కోసం సజ్జల టీమ్ కూడా పని చేసిందని తాజాగా బయటికి వచ్చింది.
ప్రస్తుతం సకలశాఖల మంత్రిగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కు అనుకూలంగా సజ్జల భార్గవ్ రెడ్డి టీమ్ కూడా పని చేసింది. తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున విపరీతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ వీరి ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. పైగా సోషల్ మీడియా ప్రచారంలో సజ్జల భార్గవ్ రెడ్డి వ్యూహాలు వికటించాయని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు చెందిన సోషల్ మీడియా టీమ్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. భార్గవ్ రెడ్డి చేసిన సోషల్ మీడియా ప్రచారం, అందులో వారు అమలు చేసిన వ్యూహాలు ప్రభావవంతంగా లేకపోవడంతో ఇప్పుడు ఆ టీమ్ సత్తాపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా వివిధ పార్టీల సోషల్ మీడియా టీమ్లలో పని చేసే వారికి పరిచయాలు ఉంటుంటాయి. ఇలా పక్క రాష్ట్రంలోని పార్టీ కోసం పని చేసే సమయంలో రెండు టీమ్ల మధ్య సమన్వయం ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ టీమ్.. చాలా సమర్థంగా పని చేసిన సంగతి తెలిసిందే. మంత్రి వేర్వేరు వర్గాల వ్యక్తులతో సమావేశం కావడం, వారు ప్రశ్నలు అడగడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లతోనూ ప్రచారం చేయించారు. వివిధ యూట్యూబ్ ఛానెళ్లలోనూ కేటీఆర్ కనిపించి వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ మెట్రో రైలులో ప్రయాణించేలా, చార్మినార్ వద్ద సామాన్యుడిలా తిరగడం అన్నీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసమే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి భిన్న రీతిలో కేటీఆర్ టీమ్ పని చేసింది.
కానీ, సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా టీమ్ పని తీరు పట్ల మాత్రం తమకు నష్టమే జరిగిందని కేటీఆర్ టీమ్ భావిస్తోంది. అందుకే ఆ టీమ్ పైన కేటీఆర్ టీమ్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అదీకాక, అసలే ఏపీలో ఎన్నికలు ఉన్నందున.. సజ్జల టీమ్ సత్తాపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కనీసం అక్కడైన ప్రభావవంతంగా పని చేసి జగన్ కు మేలు చేకూరుస్తారో లేక నట్టేట ముంచుతారో అన్న అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది.