ఏపీ భూ భాగోతాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదవాడికి సెంటు భూమి పేరుతో భారీ స్కెచ్ కు ప్రణాళిక సిద్ధమైనట్లు బయటకొస్తోంది. 25 లక్షల మంది పేదలకు ఒకేసారి సెంటు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.7000 కోట్లతో 65 వేల ఎకరాలు కొనుగోలు చేసింది. ఇక్కడే భూ కుంభకోణానికి భీజం పడింది.
ముందుగా స్థానిక వైసీపీ నేతలు రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి మార్కెట్ రేటు ప్రకారం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆపైన ప్రభుత్వం నుంచి ఎంత వచ్చినా రైతులకు సంబంధం ఉండదు. మార్కెట్ విలువ ఎకరా పది లక్షలు ఉంటే రైతుకు ఎకరాకు పది లక్షలు ఇచ్చే విధంగా ముందస్తు ఒప్పందాలు జరిగిపోతాయి. ఆ రైతు స్థానిక ఎమ్మార్వోను కలసి ఇళ్ల స్థలాలకు తమ భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని దరఖాస్తు చేసుకుంటాడు. ఇక వెంటనే ఆ అధికారి పరిశీలించి ఆ భూముల వివరాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కు పంపిస్తాడు. ఆ వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. ఆ భూముల ధరను ఎకరా రూ.50 లక్షలు నిర్ణయించేలా ఒత్తిడి చేస్తారు. ఇక అంతే పది లక్షల భూమికి రూ.50 లక్షల చొప్పున చెల్లింపులు జరిగిపోతాయి. ఇక్కడ రైతుకు ముట్టేది మాత్రం ఎకరాకు పది లక్షలే. అంటే ఒక్క ఎకరా కొనుగోలు లోనే రూ.40 లక్షలు చేతులు మారాయనమాట. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోనే ఇలా 243 ఎకరాల భూమి పేదల కోసం కొనుగోలు చేశారు. అంటే ఈ వ్యవహారంలో రూ.97 కోట్లు చేతులు మారాయి.
కాకినాడ, రాజమండ్రి ఆవ భూముల్లో అయిదు రెట్లు
ఆవ భూములు అంటేనే ముంపు ప్రాంతమని అర్థం. కనీసం వాటిలో పంటల సాగు కూడా సాధ్యం కాదు. సంవత్సరానికి రెండు, మూడు నెలల పాటు ఆ భూముల్లో 3 అడుగుల నుంచి 16 అడుగుల మేర నీరు నిల్వ ఉంటుంది. అలాంటి భూముల ధర ఎకరాకు 8 లక్షలకు మించి లేదు. కానీ వైసీపీ నేతల అండతో అధికారులు ఎకరాకు రూ.52 లక్షలు చెల్లించేశారు. అంతే కాదు. ఆ భూములను మెరక చేయడానికి ఎకరాకు మరో రూ.30 లక్షల దాకా ఖర్చు చేశారు. ఏపీలో వైసీపీ నేతలకు మాత్రమే మట్టి ఉచితంగా దొరుకుతుంది. మరెవరికీ గుప్పెడు మట్టి దొరికే పరిస్థితి లేదు. అందుకే చిన్న కాంట్రాక్టు పనులు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.
కాకినాడ మడ అడవుల మీద కూడా కన్నేశారు. తీర ప్రాంతాల్లో తుపానులు, వరదలు, సముద్రం నుంచి వచ్చే ఆటు, పోటులను నివారిస్తూ సమీప ప్రాంత ప్రజలను వదర భారి నుంచి రక్షించే మడ అడవులకే టెండర్ వేశారు. కాకినాడ సమీపంలో 300 ఎకరాల మడ అడవులను పెకిలించి వెంచర్లు వేశారు. ఇప్పుడు అవన్నీ వరదలతో నీట మునిగాయి. పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
అడ్డంగా దొరికిపోయిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణంలో పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రైతుల వద్ద నుంచి ఎకరా రూ.8 లక్షల చొప్పున 70 ఎకరాలను బినామీల పేరుతో కొనుగోలు చేశారు. కూలీలు, వైట్ రేషన్ కార్డు ఉన్న కొందరు కూలీల పేరుతో ఒకే రోజు 70 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగడంతో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఎకరా రూ.8 లక్షలకు కొనుగోలు చేసి వెంటనే ప్రభుత్వానికి ఎకరా రూ.52 లక్షలకు కట్టబెట్టారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది. దీనికి తోడు కావలి పట్టణ సమీపంలోని ప్రభుత్వ భూములను కాదని 16కిలోమీటర్ల దూరంలోని భూములు కొనుగోలు చేయడంతో వ్యవహారం రట్టయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఇదే వ్యవహారం నడిచింది.
ప్రకాశం జిల్లా కందుకూరులో అయితే పేదల పేరుతో పెద్దలు దందా కొనసాగించారు. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఎకరా రూ.5 లక్షలుకూడా లేని భూమిని ప్రభుత్వానికి రూ.52 లక్షలకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక పెద్దలు చక్రతిప్పారని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా కొండపల్లిలో పరాకాష్టకు వసూళ్లు
కొండపల్లిలో ప్రభుత్వ భూమిని సేకరించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో రకం దందా నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భూమి రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంతో అక్కడ సెంటు రూ.3 లక్షలు పలుకుతోంది. ఇక లబ్దిదారుల నుంచి లక్ష రూపాయలు చొప్పున వసూళ్లకు బరితెగించారు. లబ్దిదారులు ఎవరైనా డబ్బు చెల్లించలేకపోతే వారి పేరు లిస్టులో మాయం చేస్తున్నారు. దీంతో ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పు చేసి కొందరు అక్రమార్కుల ఆకలితీరుస్తున్నారు.
విజయవాడ రూరల్ నున్న గ్రామంలో దారి లేని 40 ఎకరాల భూమిని ఎకరా రూ.70 లక్షలకు వైసీపీ పెద్దలు కట్టబెట్టారు. నున్న లోని సర్కారుతోటకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. అక్కడకు వెళ్లాలంటే పెద్ద వాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వాగు అవతలి ప్రాంతంలో భూములకు ఎకరాకు పది లక్షల ధర కూడా లేదు. అలాంటి భూమిని అధికారులు రూ.70 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ అక్రమ వ్యవహారాలకు అప్పటి విజయవాడ రూరల్ మండల రెవెన్యూ అధికారిణి వనజాక్షి సహకరించకపోవడంతో ఆమెను వెంటనే ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో వైసీపీ నేతల పని సులువైంది.
ఇలా ఏపీలో భూ బాగోతాలు చెప్పనలవికాదు. పేదలకు సెంటు భూమి పేరుతో వైసీపీ పెద్దలు భారీగానే దిగమింగారనేది బహిరంగ రహస్యమే.