ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై గెలిచినా..అధికార పార్టీకి జైకొట్టే సంస్కృతి సాధారణమైపోయింది. తెలుగురాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఇది జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ముందంజలో ఉన్నాయి. తరువాతి స్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. దేశంలో 2016-2020 మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపు వేటు పడకుండా పార్టీలు మారిన వారి సంఖ్యను వెల్లడించింది. ఈ జాబితాలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి వెళ్లినవారి సంఖ్య చాలా తక్కువగా ఉండగా కాంగ్రెస్ నుంచి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2016-20 మధ్య కాలంలో మొత్తం 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా, బీజేపీ నుంచి కేవలం 18 మంది మాత్రమే వెళ్లారని తేల్చింది. కాగా బీఎస్పీ, టీడీపీ నుంచి 17మంది చొప్పున, వైసీపీ, ఎన్పీఎఫ్ నుంచి 15మంది చొప్పున పార్టీ వీడినట్టు తేల్చింది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఇతర పార్టీల్లోకి వెళ్లినట్టు తేల్చింది. ఎంపీల విషయానికి వస్తే టీఆర్ఎస్ , వైసీపీల నుంచి ఒక ఎంపీ చొప్పున వేరే పార్టీకి వెళ్లారు.
టీఆర్ఎస్ మూడో స్థానంలో..
ఇక చేరికల విషయానికి వస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల తరువాత టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీలకు చెందిన 182 మందిని బీజేపీ చేర్చుకోగా, 38 మందిని కాంగ్రెస్ చేర్చుకుంది. టీఆర్ఎస్ 25మందిని చేర్చుకోగా AITC (మమతా బెనర్జీ) 16మందిని చేర్చుకుని నాలుగోస్థానంలో నిలిచింది. ఇక రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని 10మందిని బీజేపీ చేర్చుకోగా ఇద్దరిని టీఆర్ఎస్ చేర్చుకుంది. ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, AITC పార్టీలు ఒక్కొక్కరు చొప్పున చేర్చుకున్నాయి. అంతేకాదు.. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు (చేరికలకు ముందు) పర్సెంటేజీతో పోల్చితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి శాతం 44గా ఉంది. అంటే బీజేపీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో (చేరికలకు ముందు) ప్రతి వందమందిలో 44మంది ఇతర పార్టీలవారేనని అర్థం చేసుకోవచ్చు.
2018 ఎన్నికల్లో..
2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2 బీజేపీ 1, ఇండిపెండెంట్ లు రెండు చోట్ల గెలుపొందారు. ఐతే తరువాతి కాలంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడంతో అధికార పార్టీ బలం 103కు చేరింది. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం మీద కాంగ్రెస్ బలం 6కి పడిపోయింది.
2014 ఎన్నికల విషయానికి వస్తే.. ఉద్యమ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోనూ టీఆర్ఎస్ 63 గెలిచింది. అప్పట్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 21చోట్ల గెలిచింది. టీడీపీ-బీజేపీ పొత్తు ఉండగా టీడీపీ 15 సీట్లు, బీజేపీ 5, బీఎస్పీ 2 గెలిచింది. అయితే టీడీపీ నుంచి ఒకరిద్దరు మినహా చాలామంది నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 25 మందిని టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని సదరు నివేదిక వెల్లడించింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన మొత్తం సంఖ్య చూస్తే.. 405మంది పార్టీలు మారారు. వీరిలో 182 మందిని చేర్చుకున్న బీజేపీ ప్రథమ స్థానంలో, 38మందిని చేర్చుకున్న కాంగ్రెస్ రెండో స్థానంలో, 25 మందిని చేర్చుకున్న టీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది.
Also Read : సాగర్లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు