రాజధాని ప్రాంతంలో చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ఉండవల్లి శ్రీదేవి ఆయన మరిది అయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్లు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వెలగపూడి గ్రామానికి చెందిన చలివేంద్ర సురేష్ ఓ ఆడియోలో సీఎం జగన్ను వేడుకున్నారు. హైదరాబాద్లో చదువు మానేసి వచ్చి ఈ ప్రాంతంలో వైసీపీ కోసం ఎంతో పనిచేశానని అన్నాడు. తన గురించి సీఎంవోలో ఎవరిని అడిగినా చెబుతారని, జగనన్నా నీవు రక్షించక పోయినా పార్టీ కోసం చనిపోవడానికి తాను సిద్ధమే అని పేర్కొన్నారు.
వెలగపూడి గ్రామంలో ఒక చర్చి విషయంలో నిన్న రాత్రి జరిగిన గొడవలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు , తుళ్ళూరు సిఐ దర్మేంద్ర బాబు తనకు గురిపెట్టి తనను చంపేందుకు ప్రయత్నించగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నానని చలివేంద్ర సురేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో తనకు ప్రాణ హాని ఉందని, సీఎం జగన్మోహన్రెడ్డి రక్షణ కల్పించాలని ఆయన పోస్టులో కోరారు. చలివేంద్ర సురేష్ పెట్టిన పోస్టులు, ఆడియోలు సంచలనంగా మారాయి. ఈ విషయమై తుళ్ళూరు సీఐని సంప్రదించగా వెలగపూడిలో గొడవ జరుగుతోందని తెలిసి అక్కడకు వెళ్లి గుంపును చెదరగగొట్టామని చెప్పారు.











