దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ పేరు తెలియని పార్టీ లేదు. ఆయన గురించి తెలియని నేత కూడా లేరు. వీలయితే పీకే సేవలను వినియోగించుకుందామని భావించే రాజకీయ నేతలే లేరంటే కూడా అతిశయోక్తి కాదేమో. అందుకే కాబోలు.. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్టీపీ కూడా పీకే సేవలనే ఎంచుకుంది. ఏపీలో జగన్ను మరోమారు గెలిపించే బాధ్యతలను ఇప్పటికే భుజానికెత్తుకున్న పీకే టీమ్.. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా పుట్టిన వైఎస్సార్టీపీని అధికారంలోకి తెచ్చే పనిని కూడా తీసుకుంది. అంటే ఏపీలో అన్నకు సేవలందిస్తున్న పీకే టీమ్.. తెలంగాణలో చెల్లికి కూడా సేవలందించనుందన్న మాట.
అప్పుడు ఇప్పుడూ అదే వేదిక
2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ.. కనీసం 2019లో అయినా అధికారం చేజిక్కించుకునేదెలా అన్న దిశగా ఆలోచించి.. 2014 ఎన్నికల్లో మోదీకి బంపర్ మెజారిటీ సాధించిన ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని తీర్మానించింది. అందులో భాగంగా జగన్ నుంచి పిలుపు అందుకున్న పీకే.. ఆయనతో భేటీ కోసం నేరుగా హైదరాబాద్లోని లోటస్ పాండ్ కు వచ్చారు. అక్కడే జగన్ తో భేటీ అయ్యారు. జగన్ కూడా పీకేను అక్కడే పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. సరిగ్గా అప్పటిమాదిరే ఇప్పుడు కూడా వైఎస్సార్టీపీకి సేవలందించే విషయంలో చర్చల కోసం పీకే టీమ్ లోటస్ పాండ్ కు వచ్చింది. అప్పుడు జగన్ తో పీకే భేటీ అయితే.. ఇప్పుడ పీకే టీం షర్మిలతో భేటీ అయ్యింది. నాడు జగన్ తో భేటీ, ఇప్పుడు షర్మిలతో ఐపాక్ భేటీకి లోటస్ పాండే కేంద్రం కావడం గమనార్హం.
షర్మిలను గెలిపిస్తారా?
2019 ఎన్నికల్లో ఏపీలో అటు తెలుగు దేశం పార్టీ ఉంటే.. ఇటు వైసీపీ బరిలోకి దిగింది. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టి బరిలోకి దిగిన బీజేపీ, జనసేనలు విడివిడిగానే పోటీ చేశాయి. వెరసి నాలుగు స్తంభాలాటలో వైసీపీ రికార్డు విక్టరే కొట్టింది. టీడీపీ బలం భారీగా తగ్గినా.. చిన్న చిన్న మార్జిన్లతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు చాలా మందే ఉన్నారు. సరే.. ఏపీ అంటే టీడీపీతో పాటు వైసీపీకి కూడా కార్యక్షేత్రమే కాబట్టి.. వైసీపీ గెలిచిపోయింది. అందుకు పీకే వ్యూహాలు కూడా పనిచేశాయని కూడా చెప్పక తప్పదు. అయితే తెలంగాణలో పరిస్థితి వేరు కదా. ఏపీకి చెందిన వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినంటూ సరికొత్త రాజకీయం మొదలెట్టారు. షర్మిలతో పాటు మొత్తంగా వైఎస్సార్ ఫ్యామిలీపై తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో వైఎస్సార్టీపీ గెలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే. కనీసం పరామర్శకు వస్తానని షర్మిల అంటేనే.. మాకొద్దు మీ పరామర్శలు అని తెలంగాణ జనం అంటున్నారంటే వైఎస్సార్టీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్ది షర్మిల పార్టీని పీకే ఎలా అధికారంలోకి తీసుకొస్తారో చూడాలి.
Must Read ;- పీకే లేకుండా జగన్ గెలవలేరు