మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి టైం బాగాలేనట్టుంది. ఇప్పుడు ఆయన కేసుల సుడిగుండంలో చుట్టుకున్నారు. ఇప్పటికే నాని ఫ్యామిలీపై రేషన్ బియ్యం మాయం చేసిన కేసుతో పాటు ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు మరో కేసు నమోదైంది. అధికారంలో ఉండగా… టీడీపీ కార్యకర్తలపై నాని పెట్టించిన కేసులో తానే అడ్డంగా బుక్కై ఏకంగా అరెస్టు వారెంటు దాకా పరిస్థితి తెచ్చుకున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాని కారణంగా పేర్నిపై అరెస్టు వారెంటు జారీ చేసింది మచిలీపట్నం కోర్టు.
ఇంతకీ ఏం జరిగిందంటే –
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పేర్నికి జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో అదే ఏడాది మచిలీపట్నానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై నాని కేసు పెట్టించారు. ఈ కేసు మచిలీపట్నం కోర్టులో విచారణకు రాగా…ఈ కేసులో నాని సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎప్పుడు జరిగినా…కోర్టుకు హాజరయ్యే విషయాన్ని నాని అస్సలు పట్టించుకోలేదు. గడిచిన ఐదేళ్ల పాటు ఆయన ఈ కేసును పట్టించుకోలేదు. దీంతో సోమవారం ఈ కేసు విచారణకు రాగా…ఒక్క వాయిదాకు కూడా హాజరు కాని నానిపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
2019లో వైసీపీ అదికారంలోకి రాగానే…తన భార్య పేరిట ఓ భారీ గోదామును నిర్మించిన నాని… దానిని సివిల్ సప్లైస్ కు అద్దెకు ఇచ్చారు. అయితే ఈ గోదాములో నుంచి భారీ సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లుగా కూటమి సర్కారు రాగానే బయటపడిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగానే…నాని తన భార్య, కుమారుడితో కలిసి పరారయ్యారు. కోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ పొందిన తర్వాతే ఆయన ఫ్యామిలీతో సహా అజ్ఞాతం వీడారు. అయినా కూడా ఈ కేసులో నానికి చిక్కులు తప్పవన్న వాదన అయితే బలంగానే వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే… ఆరోపణలు రాగానే.. బియ్యం మాయమైన మాట వాస్తవమేనని ఒప్పుకున్న నాని ఆ బియ్యానికి సరిపడ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించేశారు.
2024 ఎన్నికలకు ముందు తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దించిన నాని..కుమారుడిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారులన్నీ తొక్కారు. వాటిలో నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించి కుమారుడితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ వ్యవహారం మొన్నటి వల్లభనేని వంశీ నకిలీ పట్టాల కేసు సందర్భంగా అధికారులు వెలుగులోకి తీశారు. దీనిపైనా నాని, కిట్టులపై కేసు నమోదు కాగా… తండ్రీకొడుకులు ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా కేసు నమోదు కాగానే నాని, ఆయన ఫ్యామిలీ అండర్ గ్రౌండ్కు వెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా, పేర్ని నాని అరెస్టుకు టైం దగ్గర పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.











