జగన్ పాలన పట్ల జనం ఎంత విసుగు చెందారో, ఆ ప్రభావం ఎలా ఉండబోతోందో త్వరలో
తేలిపోనుంది. అధికారంలోకి తెచ్చిన ఓటర్ల మనసులో ఏముందో ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోందన్న విషయం జగన్కు స్పష్టమవుతోంది. ఇదే అభిప్రాయాన్ని నేతలు, సినీ ప్రముఖులు సైతం వ్యక్తం చేస్తున్నారు. 175కు 175 సీట్లు గెలుస్తామని కాన్ఫిడెన్స్తో ఉన్న వైసీపీది ఓవర్ కాన్ఫిడెన్సే నంటున్నారు చాలా మంది. చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్ మునుముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారో త్వరలో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు.
స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, చలన చిత్ర రంగంలో అనేక పదవులు అధిరోహించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అభిప్రాయం కూడా ఇదే. 2019 వరకూ ఆయన వైఎస్సార్ సీపీలో ఉన్నారు. ఆ పార్టీ నేతలతో చిన్న అభిప్రాయ బేధాల కారణంగా ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలను ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు.చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నుంచి వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలుపెవరిదన్న అంశాలపై ఆదిశేషగిరిరావు తనదైన మార్క్ విశ్లేషణ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోయేది ఒక్క ముక్కలో తేల్చేశారాయన.
ఇప్పుడున్న రాజకీయాలను ఔపోసన పట్టిన నేతగా ఆయన అద్భుతమైన విశ్లేషణ చేశారు. చంద్రబాబుపై కేసుల వల్ల వైసీపీకి ఊహించని నష్టం ఎదురవటం ఖాయమని సూటిగా చెప్పేసిన ఆదిశేషగిరిరావు ఈ వ్యవహారం రాజకీయ కక్షతోనే జరుగుతోందన్నారు. వైసీపీలో ఉన్న వ్యతిరేకతనూ ఆయన బయటపెట్టారు. ఈ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి కలిసొస్తుందని వివరించిన ఆదిశేషగిరిరావు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న స్థాయిలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయని అంచనా వేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉండొచ్చన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సలహాదారుల సూచనలతోనే జగన్ చంద్రబాబుపై కేసులకు తెరతీశారన్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయి.
మొత్తంగా ఏపీలో 2014 పరిస్థితులు తథ్యమని తేల్చిచెప్పారాయన. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చాలా మంది రాజకీయ నేతలను, ప్రముఖులను పునరాలోచనలో పడేసింది. మిగతా వారితో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కూడా చంద్రబాబు వెంటే ఉండబోతోంది. బాలయ్య కొత్త సినిమా భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ ఈవెంట్కు మహేశ్ బాబు హాజరుకానుండటం కూడా ఇందులో భాగమే. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ కుటుంబంలో పెద్ద అయిన ఆదిశేషగిరి రావు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ బాటలోనే త్వరలో మరికొంత మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది.











