అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల ఎంపిక, ప్రత్యర్దులను ఓడించడం వంటి అంశాలపై వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపికతో పాటు వ్యూహరచన కూడా ఆయనే రూపొందిస్తున్నారు.
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ప్రతిరోజు ప్రగతి భవన్ లో ఆయా జిల్లాలకు చెందిన ఆశా వాహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆ జిల్లాకు చెందిన మంత్రులు పార్టీ సీనియర్లతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక కాని, వ్యూహాలు కాని అన్ని పనులను కేటీఆర్ కే అప్పగించారని అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని స్దానాలను గెలుచుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిలో కేటీఆర్ తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అన్ని స్దానాలలో విజయం సాధిచడం ద్వారా పార్టీ పగ్గాలు కేటీఆర్ కు పూర్తిగా అప్పగించవచ్చునని, ఇలా చేస్తే పార్టీలో సీనియర్ల నుంచి కూడా ఎదురు రాదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. పట్టభధ్రులను పార్టీ వైపు తిప్పుకుంటే చదువుకున్న వారు కూడా తమ వెంటే ఉన్నారనే సంకేతాలు ఇవ్వవచ్చునన్నది మంత్రి కే.తారక రామారావు ఉద్దేశ్యంగా చెబుతున్నారు. పట్టభద్రుల అభ్యర్ధుల ఎంపిక ఈసారి మరింత పారదర్శకంగా జరగాలని, పార్టీలో అవకాశాలు రాని వారిని ఎంపిక చేసి ఈసారి అవకాశం ఇవ్వాలన్నది కేటీఆర్ భావనగా చెబుతున్నారు.
ప్రతిపక్షాలు సై…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంపై విద్యావంతుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నది ప్రతిపక్షాల లక్ష్యంగా చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. పార్టీలో ఎలాంటి పొరపొచ్చాలకు తావు లేకుండా అందరూ కలిసి పని చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టిక్కట్లు ఆశిస్తున్న పట్టభద్రులు ఎక్కువగానే ఉన్నారు.
వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు సీనియర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు పట్టభద్రులై ఉండి ఓటర్లుగా నమోదు కాని వారిని జిల్లాలో నాయకులు కలిసి వారిని ఓటర్లుగా చేర్పించే పనిలో ఉన్నారు.
“బండి“ లాగాల్సిందే ఆయనే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత పూర్తిగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీదే పడింది. పార్టీలో సీనియర్లంతా దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో విజయం సాధించి పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలని బండి సంజయ్ కష్టపడుతున్నారు. జిల్లాల్లో నాయకులతో సమన్వయ చేసుకుని అభ్యర్ధుల ఎంపికతో పాటు ప్రచారం వంటివి వారికే అప్పగించే పనిలో ఉన్నారు.
ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన బండి సంజయ్ విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్రంలో మోదీ పాలన పట్ల వారంతా అనుకూలంగా ఉన్నారన్నది బండి సంజయ్ ఆలోచనగా చెబుతున్నారు. ఆ నమ్మకమే విజయాన్ని అందిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.











