బోయనపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ఇప్పటికే అరెస్టు కావడం, ఆమె భర్త భార్గవ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓవైపు అక్క, బావలకు సంబంధించిన లీగల్ విషయాలతో పాటు.. ఆళ్లగడ్డ రాజకీయ విషయాల్లోనూ ఇప్పుడు అఖిల ప్రియ చెల్లెలు మౌనిక రెడ్డి కీలకంగా మారారు. మొన్నటి వరకు అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించినా..కిడ్నాప్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అతని కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు..కిడ్నాప్ వ్యవహారంలోనూ జగత్ విఖ్యాత్రెడ్డికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మౌనిక రెడ్డి సర్వం తానై నడిపిస్తున్నారని చెప్పవచ్చు.
రెండేళ్ల తరువాత..
ఇక ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలో భూమా కుటుంబ ప్రభావం చాలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియకు బెయిల్ రావడం కష్టంగా మారింది. రానున్న కాలంలో బెయిల్ వచ్చినా..ఈ కేసు నుంచి బయటపడేందుకు సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఆర్యోగ పరిస్థితిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మౌనికరెడ్డి రంగంలోకి దిగారు. రెండేళ్ల తరువాత మౌనికరెడ్డి గత మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. తన తల్లిదండ్రులకు ముఖ్య అనుచరులుగా ఉన్నవారితో, నమ్మకస్తులతో మాట్లాడారు.

పట్టు కోల్పోకూడదని..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఉండడంతో పాటు రానున్న ఎన్నికల్లో భూమా కుటుంబం పట్టు కొనసాగాలంటే..ప్రస్తుతం ఆ వర్గాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల మరణం తరువాత అఖిల ప్రియ రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటుండగా వివాహం తరువాత ఆమె భర్త రాజకీయ వ్యవహారాలపై పోకస్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ అక్కడ లేకపోవడం, కేసుల సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం పైచేయి సాధించేందుకు వ్యూహాలు పన్నుతోందని, తమ వర్గానికి చెందిన కొందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుందన్న సమాచారంతో మౌనిక రెడ్డి మంగళ, బుధవారాల్లో అక్కడే సమావేశాలు నిర్వహించారు. తన వర్గానికి ఏ చిన్న సమస్య వచ్చినా..తన కుటుంబం అండగా ఉంటుందని, అఖిల ప్రియ జైలుకి వెళ్లిందని అధైర్యపడొద్దని, తన వాళ్లు అన్నివేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికే చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి గతంలో గెలవడం, ఆ ఎన్నికల్లో మౌనికారెడ్డి ప్రచారం చేయడం తెలిసిందే.
ఏవీ సుబ్బారెడ్డి కదలికలే ముఖ్యం..
ఓవైపు రాజకీయ ప్రత్యర్థులను, కిడ్నాప్ కేసును ఎదుర్కోవడంతో పాటు మౌనిక రెడ్డికి, జగత్ విఖ్యాత్ రెడ్డికి మరో సవాలు ఎదురు కానుంది. తన తండ్రితో ఇన్నాళ్లు కలిసి ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో ప్రస్తుతం వైరం ఏర్పడింది. తాజాగా హఫీజ్పేట భూముల కేసు విషయంలోనూ ఏవీ సబ్బారెడ్డి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకని తరవాత వదిలేశారన్న ప్రచారం నేపథ్యంలో ఏవీ సబ్బారెడ్డి..వీరికి వ్యతిరేకంగా పావులు కదుపుతారా..లేక ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ ఏవీ సుబ్బారెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తే..ఆర్థిక అంశాల్లోనూ మరింత జాగ్రత్త పడాల్సిన పరిస్థితిని మౌనిక రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మౌనిక రెడ్డి ఆళ్లగడ్డకు వెళ్లి తమవాళ్లతో మీటింగ్ పెట్టారని చెబుతున్నారు. ఈ సమావేశంలో భాగంగా.. ఈ కేసు విషయంలో అనవసర రాద్దాంతం వద్దని, బయటపడతామని తమవాళ్లకు భరోసా ఇస్తూనే.. ఈ కేసులో రాజీకి సిద్ధమనే సంకేతాలను పరోక్షంగా ఏవీ సుబ్బారెడ్డికి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. మరి హఫీజ్పేట భూముల వ్యవహారం..ఆళ్లగడ్డ రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందనేది రానున్న కాలంలో తేలనుంది.
వీరి సపోర్టు ఉంటుందా..
భూమా కుటుంబానికి పెద్ద బంధువర్గమే ఉంది. సీనియర్ రాజకీయ వేత్త ఎస్వీ మోహన్ రెడ్డి, మంచు కుటుంబాలతోనూ బంధుత్వం ఉంది. ఇక రాజకీయంగా కీలకమైన నేత కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది నాయకులు బయటకు తెలియకండా..తమ తమ స్థాయిలో రాజీ మార్గాల కోసం ప్రయత్నించడం, అన్ని విధాలుగా అండగా నిలబడతారన్న చర్చ కూడా నడుస్తోంది.











