తెలంగాణ టిడిపిలో ముసలం పుట్టింది. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణను మార్చాలంటూ పార్టీ నేతలు కొందరు చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని ఒక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీలోని కొందరు నేతలు తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు చంద్రబాబును కలిసి మాట్లాడారు. మరికొంతమంది నేతలు నాయకత్వ మార్పుపై చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడేళ్లుగా రమణ ఒక్కరే పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారని ఆరోపించారు. పార్టీకి తిరిగి పునరుజ్జీవం తీసుకురావాలి అంటే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పు తప్పనిసరి అని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.
పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలంటే అధ్యక్షుడి మార్పు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధినేతకు తెలంగాణ తమ్ముళ్లు లేఖ రాశారు. గత ఏడేళ్ళుగా ఒక్కరినే అధ్యక్షునిగా కొనసాగించడం వల్ల పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారని, తక్షణం నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలని కోరారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశంలో పార్టీ అధ్యక్షుడు మార్పు అంశం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ఎన్నికల్లో వరుస పరాజయాలు!
ఒకప్పుడు తెలంగాణలో టిడిపికి బాగా పట్టుండేది. టిడిపి హవా కొనసాగుతున్నప్పుడు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టిడిపీ కైవసం చేసుకునేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టిడిపి పరిస్థతి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో టిడిపి పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈక్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా టీడీపీ సిద్దపడింది. ఆ ఎన్నికల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ అధినేతలతో కలిసి ప్రచారం చేడం, వేదికలను పంచుకోవడం జరిగింది. ఇదంతా తెలంగాణలో పార్టీని గట్టెక్కించేందుకే. కానీ తెలంగాణలో టీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఆ ఎమ్మేల్యే కూడా క్రమంగా అధికార పార్టీకి దగ్గరవడంతో ఇక తెలంగాణలో టిడిపి చాప్టర్ ముగిసినట్లేనని అంతా భావించారు.
పార్లమెంట్ ఎన్నికలలోనూ ఖాతా తెరవలేదు…
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఆరు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ వైపు ఖాతా కూడా తెరవలేదు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ దాదాపు అదే పరిస్థితి. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ కార్యకలాపాలు అస్సలు జరగడం లేదు.
మార్పు విజయానికి చేరువ చేయనుందా?…
ప్రస్తుత అధ్యక్షుడు రమణను మార్చాలంటూ కొందరు సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. దాదాపు ఏడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతున్నారు. అప్పడప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. అయితే సుదీర్ఘంగా ఏళ్ల తరబడి అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఆయనపై పార్టీ నేతలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తెలంగాణలో పార్టీ పరిస్థితిని గురించి చంద్రబాబుకు వివరించిన సమాచారం. అలాగే కింది స్థాయి నుండి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిలతో పాటు కోర్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని వారు చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుని మార్పుతో తెలంగాణలో టిడిపి పుంజుకునే అవకాశం ఉంటుందా అనే చర్చకూడా సాగుతోంది. అయితే అధ్యక్షుడి మార్పుపై తెలుగుదేశం అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.











