ఊపునిచ్చేందుకు ఓ నినాదం…
స్థిరత్వాన్నిచ్చేందుకు ఓ విధానం…
ఇవీ ఏ రాజకీయ పార్టీకైనా ఆయువుపట్టు వంటి అంశాలు.
కానీ పార్టీ స్థాపించి ఆరేళ్లు దాటినప్పటికీ జనసేన పార్టీ కీలకమైన ఆ రెండు అంశాలు తమకు పట్టవనేట్టుగా వ్యవహరిస్తోంది. ‘నినాదం’ అన్నది ఎన్నికల సమయంలో అవసరం…కానీ విధానం అన్నది సదా అవసరమేనని గుర్తించడం లేదు. విధానపర అంశాల్లో స్పష్టత లేకపోవడమే తమ పార్టీ విధానంగా పవన్కల్యాణ్ భావిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రాజధాని అమరావతి విషయంలో కూడా ఆయన తమ విధానాన్ని స్పష్టం చేయలేకపోవడం జనసేన రాజకీయ బలహీనతను తెలియజేస్తోంది.
సందిగ్దంలో పవన్ కల్యాణ్
రాష్ట్ర రాజధాని విషయంలో రాష్ట్ర రాజకీయాలు రెండుగా చీలిపోయాయి. వైఎస్సార్సీపీ మూడు రాజధానుల విధానానికి అధికార వైఎస్సార్సీపీ అనుకూలం కాగా… ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. అసలు ఈ అంశమే తమకు సంబంధంలేదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉండగా అమరావతి ఉద్యమాన్ని బలపరిచింది. సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుకాగానే ఆ అంశంపై నెమ్మదిగా వెనక్కుతగ్గుతోంది.
జాతీయ పార్టీ కావడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలభూమిక పోషించే ఉద్దేశం పెద్దగా లేని ఆ పార్టీ నుంచి అంతకన్నా ఆశించలేం. కానీ రాష్ట్రంలోనే రాజకీయంగా తాడో పేడో తేల్చుకోవాల్సిన జనసేన కూడా రాజధాని విషయంలో తమ విధానం ఇదీ అని ప్రకటించలేకపోవడం విస్మయపరుస్తోంది. మూడు రాజధానులకు అనుకూలం అంటే అది జగన్కు లాభిస్తుందని… ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తే అది చంద్రబాబుకు ఉపకరిస్తుందనే సందిగ్దంలో పవన్ కల్యాణ్ కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
పోనీ ప్రస్తుతం మిత్రపక్షం బీజేపీ మార్గాన్ని అనుసరిద్దామంటే ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అతిథి పాత్రను మించి ఎదగాలని భావిస్తున్నట్టుగా లేదు. దాంతో పవన్ కల్యాణ్ తనుకు అలవాటైన రీతిలో రాజకీయ సందిగ్దంలో పడిపోయారు.
దీని భావమేమీ పవన్ కల్యాణూ…
తీవ్ర తర్జనభర్జనల మీద పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ తరువాత ఓ నిర్ణయం ప్రకటించారు. దాంతో మరింత గందరగోళ పరిచారు. అమరావతి రైతుల ప్రయోజనాలు పరిరక్షించాలన్నది తమ విధానంగా చెప్పారు. అందుకే అమరావతి రైతులు కోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్న వాదన బాగానే ఉంది. కానీ రాజధాని విషయంలో మాత్రం పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించ లేదు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలా… మూడు రాజధానులు ఏర్పాటు చేయాలా అనే రెండు ఆప్షన్లలో దేనికి తమ మద్దతని స్పష్టం చేయలేదు.
మూడు రాజధానుల విధానానికి కట్టుబడుతూ అమరావతి ప్రాంతంలో పలు విద్య, వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని ప్రభుత్వం చెబితే పవన్ కల్యాణ్ సమ్మతిస్తారా…! జనసేన ప్రకటించిన విధానం ప్రకారం సమర్థించాల్సిందే కదా. కాదు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించడం ద్వారానే రైతుల ప్రయోజనాలు కాపాడగలం అని ఆ పార్టీ భావిస్తే… అమరావతి పరిరక్షణ ఉద్యయంలో పాల్గొనాలి. కానీ ఆ పార్టీ ఇంతవరకూ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించ లేదు. అత్యంత కీలకమైన రాజధాని అంశంలో స్పష్టత లేని వైఖరితో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జనసేన రాజకీయ ఎదుగుదలకు తానే ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే ఆ పార్టీకి అంత మంచింది.











