సోషల్ మీడియాలో ఒకరిని కించపరిచే, నొప్పించే అసహ్యమైన పోస్టులు పెడితే.. వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి చట్టం ఉంది. కానీ ఆ చట్టం ఒకరికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తోంటే.. ఎవరు మాత్రం ఏం చేయగలరు?
తుళ్లూరు మహిళలు అలాగాని ఊరుకుండిపోలేదు. ఆ రకంగా, మహిళా రైతులపై అవమానకరంగా పోస్టు పెట్టిన యువకుడికి దేహశుద్ధి చేశారు. బుద్ధి చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని అతనికి బుద్ధి చెప్పారు.
ఓ వైపు బతుకు పోరాటం చేస్తుంటే ఇలా అవహేళన చేయడం ఏంటంటూ అతనిపై మండిపడ్డారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
అమరావతి రాజధాని ఉద్యమం 300వ రోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్ తుళ్లూరులోని ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ దుస్థితిని రైతులు, మహిళలు ఆయనకు వివరించారు. ఇదే అంశాన్ని అవహేళన చేస్తూ తుళ్లూరుకు చెందిన యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
ఒకవైపు సమష్టిగా తమ గ్రామాలకు, రాజధానికి రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి మడమ తిప్పని పోరాటం సాగిస్తూ ఉంటే.. స్థానికుడుగా ఉండి మద్దతు ఇవ్వాల్సిందిపోయి.. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వారికి ఆగ్రహం తెప్పించింది. ఈ విషయమై అతడిని గ్రామస్తులు నిలదీశారు. పెడసరపు సమాధానాలు ఇవ్వడంతో.. రైతులు, మహిళలు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నారు.