(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అధికారంలో ఉంటూ, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉపముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక స్పీకర్, నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు కలిగివున్న వైసీపీ జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయానికి అద్దె చెల్లించేందుకు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ‘పూటకో పేటకు’ అన్నట్టూ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికి మూడు దగ్గర్లకు మార్చడంతో ఆ పార్టీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
వివాదంలో వైసీపీ కార్యాలయం
అధికారంలో ఉన్న పార్టీలో పదవులు దక్కక నేతల మధ్య దూరం పెరగడం అనేది సాధారణ విషయం. పార్టీ జిల్లా కార్యాలయానికి అద్దె చెల్లించడానికి కూడా సిక్కోలు వైసీపీ నాయకులు ఎడమొహం పెడమొహంగా ఉంటుండటం తాజా చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అధికార పార్టీ నాయకులకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతూనే ఉంటుంది. వైసీపీ నేతల వివాదాల్లోకి ఇప్పుడు జిల్లా వైసీపీ ఆఫీస్ కూడా చేరిపోయింది. సిక్కోలు జిల్లా వైసీపీలో అందరూ ముఖ్యనేతలే. కానీ.. ఏం లాభం ఆఫీస్ ఖర్చులకొచ్చేసరికి జేబులు తడుముకొంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆ ఖర్చులు భరించిన నేత ఇప్పుడు చేతులు ఎత్తేశారని భోగట్టా.
దాంతో పార్టీ ఆఫీస్ మరోచోటుకు మార్చక తప్పలేదని తెలిసింది. ఈ అంశంపై చర్చే కాదు.. రచ్చ కూడా జరుగుతోంది. జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి ధర్మాన కుటుంబం అండగా ఉంటోంది. శ్రీకాకుళం న్యూ కాలనీలో మొదట జిల్లా పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పార్టీ ఆఫీస్ బాధ్యతలు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కృష్ణదాసే చూసుకునేవారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2013లో వైసీపీలో చేరిన తర్వాత దూకుడు పెంచారు. పార్టీ ఆఫీసును టౌన్హాల్కు షిఫ్ట్ చేశారు. అన్నిరకాలుగా అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ ఎంత పెద్ద సమావేశం పెట్టుకున్నా ఇబ్బంది ఉండేది కాదు.
పార్టీ నేతలు రెడ్డి శాంతి, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. ప్రసాదరావే ఖర్చులు.. అద్దెను భరిస్తూ వచ్చారని తెలిసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టౌన్ హాల్లో అద్దెగొడవలు మొదలయ్యాయి. ప్రసాదరావుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ ఆయన అన్న కృష్ణదాస్ను కేబినెట్లోకి తీసుకున్నారు. తమ్మినేనిని స్పీకర్ను.. అప్పలరాజును మంత్రిని చేశారు. మంత్రి పదవి దక్కక ఒకింత అసంతృప్తితో ఉన్న ధర్మాన ప్రసాదరావు పార్టీ ఆఫీస్ నిర్వహణ భారం మోయలేనని చెప్పేశారట.
పక్కకు తప్పుకున్న ప్రసాదరావు
శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్, ఇద్దరు మంత్రులు ఉన్నా.. ఖర్చులు విషయానికి వచ్చేసరికి వారంతా జేబులు తడుముకొంటున్నారట. అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రసాదరావు కొంత మొత్తం చెల్లించినా.. ఇక తన వల్ల కాదని పక్కకు తప్పుకొన్నారని తెలిసింది. ఇటు ప్రసాదరావు పట్టించుకోక.. అటు మిగిలిన నేతలు చేతులు ఎత్తేయడంతో టౌన్హాల్ భవనాన్ని ఖాళీ చేయాలని కోరారట ఆ బిల్డింగ్ యజమాని. దీంతో పార్టీ కార్యాలయం బాధ్యతలు మరోసారి భుజానికెత్తుకున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్.. సూర్యమహల్ జంక్షన్లోని ఓ భవనాన్ని పార్టీ ఆఫీసుగా తీసుకున్నారు. ఈ మార్పులు.. చేర్పులే వైసీపీ నేతలు, శ్రేణుల్లో చర్చగా మారాయి. వైసీపీ ఏర్పాటైన నాటి నుంచి జిల్లాలో మూడుచోట్లకు పార్టీ ఆఫీస్ మార్చాల్సి రావడంపై చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ అద్దెల గోల ఏంటి అని విస్తుపోతున్నారట. జిల్లాలో టీడీపీకి సొంత భవనంలో ఆఫీసు ఉంది. అధికారంలో ఉన్నా సొంత భవనం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ అద్దె గోల ఎటువైపు దారితీస్తుందోనని చర్చించుకుంటున్నారు.