చంద్రబాబు అధికారంలోకి రావడమే ఆలస్యం.. తన కలల నగరం అయిన అమరావతిని ప్రజలకు కళ్లారా చూపించేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకోసం అమరావతిలో వివిధ నిర్మాణాలకు చంద్రబాబు త్వరత్వరగా ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తున్నారు. 2014-19 వరకు తన హాయాంలోనే జరిగిన పొరపాట్లని దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగా అమరావతి పురోగతి కోసం ఒక డెడ్ లైన్ ను కూడా చంద్రబాబు ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
నిజానికి ఒక నగర అభివృద్ధి అనేది ఫలానా గడువులోపు పూర్తవుతుందని చెప్పలేనిది. హైదరాబాద్ చూసుకుంటే ఇప్పటికీ విస్తూరిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే అమరావతి కూడా నిరంతరం ఏవో ఒక నిర్మాణాలు జరుగుతూ ఉండే ప్రాంతంగా ఉండబోతుంది. అందుకే కీలక కట్టడాలైన శాశ్వత భవనాల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి నిర్వాకం వల్ల అక్కడ తుమ్మచెట్లు, పిచ్చి మొక్కలు అడ్డగోలుగా పెరిగాయి. ఇప్పుడు ఆ చెట్లను క్లియర్ చేసేందుకు పనులు జరుగుతున్నాయి.
ఇందుకు ఒకట్రెండు నెలలు పడుతుందని అంటున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని మొత్తాన్ని తొలగించిన తర్వాత రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఇప్పటికే చాలా వరకూ పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్ సహా గెజిటెడ్ అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే దీని గురించి కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ఇక పనులు ప్రారంభించడమే మిగిలిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో తక్షణం చేపట్టాల్సిన పనుల గురించిన నివేదికను ఈ మధ్య చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి సమర్పించగా.. ఆ ప్రణాళిక చూసి మోదీనే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది.
గతంలోనే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ కట్టడాల కోసం పునాదులు పూర్తయ్యాయి. ఆ పునాదులకు అవసరమైన పరీక్షలు ఇప్పుడు మరోసారి చేస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా నిర్మాణాలు ప్రారంభించనున్నారు. మొత్తంగా ఆఖరు దశలో ఉన్న ఉద్యోగులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, అపార్ట్మెంట్లు అన్నీ మరో 8 లేదా 9 నెలల్లో యుద్ధప్రాదికన వినియోగంలోకి తేనున్నాయి. అలాగే కేంద్ర సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఆయా సంస్థలకు పొజిషన్లు చూపిస్తున్నారు. ప్రభుత్వం కట్టడాలకు పెడుతున్న ఖర్చుకు రెండింతలుగా ప్రైవేటు పెట్టుబడిదారులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో మరోసారి ఆర్థిక కేంద్రంగా.. ఇరవై నాలుగు గంటలకూ పని చేసే ప్రాంతంగా అమరావతి మారనుంది.