ఏపీలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పడగ ఎన్నటికీ మరిచిపోలేనిదే. అయితే కాలక్రమంలో ఫ్యాక్షన్ నేతలంతా తమ మనసును మార్చుకుని నెత్తుటి మరకలకు స్వస్తి చెబుతూ వచ్చారు. అయితే, వైసీపీ అధినేత ఎప్పుడైతే ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో… అప్పుడే మరోమారు ఫ్యాక్షన్ పడగలు విప్పింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే… జగన్ పాలనలో ఫ్యాక్షన్ మరింతగా విస్తరించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతలను అరెస్ట్ చేస్తున్న జగన్ సర్కారు… మరోవైపు ఆయా ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైరి వర్గానికి చెందిన నేతలను అంతమొందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలోనే ఏకంగా 16 మంది నేతలు హత్యకు గురైన వైనమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పక తప్పదు.
తెలుగు దేశం పార్టీనే టార్గెట్
ఏపీలో ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజికి చేరిపోగా… వాటిని మించి హత్యలు, కీలక నేతల అరెస్ట్ల పరంపర సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో రికార్డ్ మెజారిటీతో అందలమెక్కిన జగన్… తన వైరివర్గం అయిన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీని గట్టిగానే టార్గెట్ చేశారు. తాను అధికారంలోకి వచ్చినంతనే… టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడును పాత కేసులను తిరగదోడి అరెస్ట్ చేయించారు. తనకు ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న చెప్పినా… జగన్ ఆదేశాలను చేతిలో పట్టుకుని రంగంలోకి దిగిన పోలీసులు… అచ్చెన్నను ముప్పుతిప్పలు పెట్టిన వైనం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. ఈ ఘటనను మరువక ముందే మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను జగన్ సర్కారు అరెస్ట్ చేయించింది. వ్యక్తిగత తగాదాల్లో ఓ వ్యక్తి హత్యకు గురైతే… ఆ కేసును రవీంద్రకు అంటగట్టేసిన జగన్ సర్కారు… రోజుల తరబడి ఆయనను జైల్లో పెట్టేసింది. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిల అరెస్ట్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ మూడు ఘటనలతో టీడీపీ స్వరం తగ్గించుకుంటుంది అనుకున్న జగన్… అందుకు విరుద్ధంగా టీడీపీ మరింత పైకి లేవడంతో ఫ్యాక్షన్ హత్యలకు తెర లేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సొంత జిల్లాలోనే నందం సుబ్బయ్య హత్య
తన సొంత జిల్లా కడపలోనే ఇటీవల జరిగిన నందం సుబ్బయ్య హత్య జగన్ మార్కు ఫ్యాక్షన్కు నిదర్శనంగా చెప్పాలి. ఇంటి స్థలాల పంపిణీలో చోటు చేసుకుంటున్న అవినీతిని ప్రశ్నించిన కారణంగానే… నందం సుబ్బయ్య హత్యకు గురికావడం నిజంగానే కలకలం రేపింది. సుబ్బయ్య హత్యకు వైసీపీ నేతలే కారణమని స్వయానా ఆయన సతీమణి చెప్పినా… ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న దాఖలా కనిపించడం లేదు. అంతే కాకుండా సుబ్బయ్య హత్యకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కారణమని ఆరోపణలు వినిపించినా కూడా ఆ దిశగా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. ఈ ఘటనను మరువక ముందే… గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్య మరింతగా కలకలం రేపింది. ఆది నుంచి టీడీపీ క్రియాశీల సభ్యుడిగా కొనసాగుతున్న అంకులు… గ్రామానికి ఏకంగా 15 ఏళ్ల పాటు సర్పంచ్గా వ్యవహరించారు. అలాంటి నేతను హత్య చేయడం ద్వారా జగన్ వర్గం తనదైన మార్కు ఫ్యాక్షన్ పడగ ఎలా ఉంటుందో ప్రత్యర్థి వర్గానికి చూపించిందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
19 నెలల్లో టీడీపీకి చెందిన 16 మంది నేతలు..
నిన్న నందం సుబ్బయ్య, పురంశెట్టి అంకులు… వీరి మాదిరిగానే గడచిన 19 నెలల్లో టీడీపీకి చెందిన 16 మంది నేతలు చనిపోయారు. ఈ 16 మంది నేతలను కూడా వైసీపీ వర్గీయులే హత్య చేశారన్నది బహిరంగ రహస్యమే. విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నా… జగన్ సర్కారు మాత్రం తనకేమీ ఈ మాటలు వినిపించలేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న వాదనలు లేకపోలేదు. ఇక తాజాగా కడప జిల్లాలో జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నబీటెక్ రవిని వైసీపీ సర్కారు అరెస్ట్ చేసిన తీరు కూడా ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాక్షన్ పడగకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఎప్పుడో 2018లో పులివెందులలో బహిరంగ చర్చకు టీడీపీ, వైసీపీల నుంచి సవాళ్లు రాగా… అటు వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి, ఇటు బీటెక్ రవిలు తమ అనుచరులతో కలిసి పూలంగళ్ల వద్దకు వచ్చే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోగా… పోలీసులు ఎలాగోలా వారిని చెదరగొట్టేశారు. నాడు ఇరువర్గాలపై కేసులు నమోదు కాగా… వైసీపీ వారి గురించి పట్టించుకోని పోలీసులు… బీటెక్ రవిని టార్గెట్ చేసుకుని ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అందులోనూ పరారీలో ఉన్న నిందితుడిగా బీటెక్ రవిని పోలీసులు పేర్కొనడం గమనార్హం.
మొత్తంగా జరుగుతున్న అరెస్ట్లు, చోటుచేసుకుంటున్న హత్యలను చూస్తుంటే… వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ మరోమారు పడగ విప్పుతోందనే చెప్పాలి. ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలే టార్గెట్గా జగన్ సర్కారు తనదైన మార్కు ఫ్యాక్షన్కు తెర తీసిందని చెప్పాలి. ఓ వైపు అరెస్ట్లతో టీడీపీకి చెందిన కీలక నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం… తమకు గిట్టని వారిని, టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నేతలను ఏకంగా హత్య చేయించేందుకే పక్కా ప్లాన్ ప్రకారం వెళుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమది ఫ్యాక్షన్ ఖిల్లానే అయినా తాము ఏనాడూ ఫ్యాక్షన్కు మద్దతు పలకలేదని చెబుతున్న సీఎం… అందుకు విరుద్ధంగా ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కేవలం రాయలసీమ వరకే పరిమితమైన ఫ్యాక్షన్ రాజకీయాలు ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తం చేసేందుకు కూడా జగన్ కంకణం కట్టుకున్నట్లుగానే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: కత్తితో దాడికి తెగబడ్డ వైసీపీ నేత