ప్రభుత్వంలో గుబులు మొదలైటనట్టుంది. రామతీర్థం క్షేత్రాన్ని విపక్షాలు సందర్శిస్తే గనుక.. ప్రభుత్వం అసమర్థత మరింతగా ప్రజలకు అర్థమైపోతుందని వారు కంగారు పడుతున్నట్లుంది. చంద్రబాబునాయుడు వెళ్లినందుకే.. రకరకాల కేసులు పెట్టి.. తమ తీరు ఏమిటో స్పష్టంగా సంకేతాలిచ్చిన ప్రభుత్వం.. మంగళవారం నాడు బీజేపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించదలచిన చలో రామతీర్థం కార్యక్రమం అసలు జరగకుండా అడ్డు పడింది. ఎక్కడికక్కడ అరెస్టులతో వారిని కదలనివ్వకుండా చేస్తోంది. రామతీర్థం క్షేత్రంలోకి ఎవ్వరూ అడుగుపెట్టకుండా దిగ్బంధనం చేస్తోంది.
బీజేపీ- జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంయుక్తంగా పిలుపు ఇచ్చిన ‘చలో రామతీర్థం ధర్మ యాత్ర’ను పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నారు. బీజేపీ – జనసేన పార్టీలకు చెందిన నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. విశాఖపట్టణం బీచ్రోడ్లోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీస్ బయట, లోపల పోలీసులు పహారా కాస్తున్నారు.
షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకి బీజేపీ కార్యాలయం నుంచి బీజేపీ- జనసేన చలో రామతీర్థం ధర్మ యాత్ర ను ప్రారంభం కావాల్సి ఉంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు పిలుపు ఇచ్చారు. అయితే నాయకుల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేస్తుండడం, అనుమతి లేనందున బీజేపీ నేతలు రాలీని విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ శ్రేణులు పోలీసుల కళ్లుగప్పి నేరుగా రామతీర్థం చేరుకుంటున్నాయి.
జెండా ఊపే ఛాన్స్ కూడా లేదు…
బీజేపీ – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో “చలో రామతీర్థం” అంటూ పిలుపు ఇచ్చారు. రామతీర్థంలో రాముని విగ్రహం విధ్వంసానికి కారకులైన దోషులను శిక్షించాలని, రామతీర్థాలను పరిరక్షించుకోవాలని కోరుతూ విశాఖ నుంచి కార్ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. షెడ్యూలు ప్రకారం ఈ మెగా కార్ ర్యాలీ బీజేపీ కార్యాలయం వద్ద ప్రారంభమై పోతినమల్లయ్య పాలెం వద్ద గల క్రికెట్ స్టేడియం వద్ద కాసేపు బ్రేక్ తీసుకుంటుంది. జిల్లాలో గల మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలనుండి కూడా నిర్ణీత సంఖ్యలో అక్కడ ఇతక కార్లు మెగా ర్యాలీలో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశారు. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విశాఖలో జెండా ఊపి ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణతో సహా.. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజుకు కూడా నోటీసులు జారీచేశారు.
ప్రభుత్వ అండదండలతోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, రామతీర్థం వెళ్ళకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని, అసలైన నిందితులను పట్టుకోకుండా మంత్రులు ఇతరులపై అభియోగాలు మోపుతున్నారని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుమ్మెత్తిపోశారు.
రామతీర్థం ఘటనను పరిశీలించడానికి వెళ్తున్నా బిజెపి, జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమైన విషయంగా ఆయన అభివర్ణించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయంలో జరిగిన అపచారాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని, ఘటన వెనుక ఉన్న వ్యక్తులను శక్తులను గుర్తించాల్సింది పోయి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం దారుణం అని భానుప్రకాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను క్రిస్టియన్ ప్రదేశ్గా మార్చేస్తారా అన్న భయం శ్రీవారి భక్తులు, రామభక్తుల్లో కలుగుతున్నదని ఆయన అన్నారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కోరారు.
Also Read: హవ్వ! ఎంత వైసీపీ అయితేమాత్రం ఇదేం దాదాగిరీ?











