జిగేలు రాణి బుట్టబొమ్మగా మారి ప్రేరణగా పుట్టిన వేళ.. వింటే ఈ పేర్లు తమాషాగానే ఉన్నాయి కదా. పాత్రల పేరుతో ఫ్యామస్ అవుతోంది పూజా హెగ్డే. తెలుగు సినిమా రంగం ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డే కు బాగా కలిసివచ్చిందనుకోవాలి. స్టార్ హీరోలంతా పూజాపైనే దృష్టి సారించారు. అలాంటి బుట్టబొమ్మ కు ఈరోజు పుట్టిన రోజు పండగ. అల వైకుంఠ పురంలో బొట్టబొమ్మ పాట ఈ అందాల నటికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలుసు. అప్పుడు అల్లు అర్జున్ సరసన నటించిన ఈ భామకు అమాంతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చేసింది. తెలుగు సినిమా రంగంలోకి పూజా హెగ్డే అడుగుపెట్టి ఆరేళ్లు నిండాయి.
ఇంతకీ ఈ బుట్టబొమ్మ ఎక్కడిదో తెలుసా. పుట్టింది ముంబయి. ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని మంగుళూరు నుంచి వెళ్లి ముంబయిలో స్థిరపడ్డారు. తండ్రి పేరు మంజునాథ్, తల్లి పేరు లతా హేగ్డే. వీరి మాతృభాష తుళు. 1990లో అక్టోబరు 13న పూజా హెగ్డే జన్మించింది. తెలుగులో నటిస్తున్నా ఆమెకు హిందీ, మరాఠీ, కన్నడ భాషల్లో పట్టుంది. ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డ్యాన్స్, ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. కాలేజీ చదువు ఎం.ఎం.కే. కాలేజీలో జరిగింది. ఓ పక్క తల్లికి మార్కెటింగ్ లో సాయపడుతూనే ఇంకో పక్క తనలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు చేసింది. 2010లో మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది.
2012లో మొదటి సారిగా సినిమా అవకాశం వచ్చింది. అది తమిళ సినిమా. ఆ సినిమా పేరు ముగమూడి. అందులో ఆమె పోషించిన శక్తి అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో నటన మీద మరింత ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె పయనం తెలుగు సినిమా వైపు సాగింది. నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాల్లో అవకాశం వచ్చింది. అందులో ఆమె నటించిన నందన, గోపిక అనే రెండు పాత్రలూ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. 2014లో విడుదలైన ఈ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆమె ఆకర్షించినా వెంటనే అవకాశాలు రాలేదు.
2016లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహించిన ‘మొహెంజొదారో’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాతే ఆమెకు వరుసగా తెలుగు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. అలా దువ్వాడ జగన్నాథమ్, రంగస్థలం,సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురంలో వరకూ కథానాయికగా ఆమె పయనం కొనసాగింది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా ముగింపు దశలోనే ఉంది.ఇందులో ప్రేరణ అనే పాత్రను ఆమె పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.
పాత్రల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ బుట్టబొమ్మ. సెట్ లో అందరితో జోవియల్ గా ఉంటూ వివాదాల జోలికిపోకుండా తన కెరీర్ ను కాపాడుకుంటోంది. ముఖ్యంగా బబ్లీ తరహా పాత్రలంటే ఈ భామకు ఎంతో ఇష్టమట. గ్లామర్ తరహా పాత్ర ఏదున్నా దర్శకుల దృష్టిలో పూజ పడుతోంది. ‘రంగస్థలం’లో ఆమె ఓ పాటలో మాత్రమే కనిపించినా ఆ పాటకు ఎంత స్పందన వచ్చిందో అందరికీ తెలుసు. జిగేలు రాణీ అంటూ సాగే ఈ పెప్సీ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. మొత్తానికి తెలుగు సినిమాకు పూజా హెగ్డే ఓ గోల్డెన్ లెగ్ అనుకోవాలి. అలా వరుస హిట్లలో దూసుకుపోతోంది.











