ఇది నిజమా… కాదా అన్నది మాత్రం తెలియ రావడం లేదు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఏపీ గవర్నర్తో చర్చించిన అంశాలలో ప్రధానమైనది జాతీయ విద్యావిధానం 2020 గురించే అయినా అంతర్గతంగా మాత్రం అనేక అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ 19 ను అదుపు చేయడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గురించి రాష్ట్రపతి సమాచారం తెలుసుకున్నారంటున్నారు.
ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో తీసుకుంటున్న చర్యలు గవర్నర్ దృష్టికి వచ్చాయా… లేక ప్రభుత్వమే సొంత నిర్ణయాలు తీసుకుంటోందా అని కూడా ఆరా తీసినట్లు చెబుతున్నారు. రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారో… ఎంత మందికి ఈ వ్యాధి నుంచి బయట పడుతున్నారు అనే అంశాలపై రాజభవన్ కు నిత్యం నివేదికలు వస్తున్నాయా అని కూడా అడిగినట్లు చెబుతున్నారు.
శిరోముండనాలపై ఆరా…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ దళితులపై దాడులు ఎక్కువ కావడంపై కూడా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అడిగినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితునిపై జరిగిన దాడి ఏకంగా రాష్ట్రపతి భవన్ కే ఫిర్యాదు రూపంలో రావడం కూడా ఆయన ప్రస్తావించారా అనే అనుమానాలు వస్తున్నాయి. వరుసగా శిరోముండనాలు జరగడం దళితుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం సన్నగిల్లే అవకాశాలున్నాయని, దీనిపై కూడా రాజ్ భవన్కు సమాచారం ఏమైనా ఉందా అని ఆరా తీసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రాజ్ భవన్ కు వచ్చిన సమాచారానికి, వాస్తవాలకు మధ్య భేధం ఏమైనా ఉందా అని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అడిగే ఉంటారని దళిత సంఘాల నాయకులు భావిస్తున్నారు.
రాజధాని విషయం ప్రస్తావించారా…
అమరావతి రాజధాని అంశం వివాదం కావడం, అక్కడి రైతులు కూడా రాష్ట్రపతికి ఇంతకు ముందు ఫిర్యాదు చేయడంపై కూడా ప్రస్తావించి ఉంటారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రస్తావనపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చినా… వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ సమాచార సేకరణ చేసి ఉంటారా అని అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళపై సౌందర రాజన్ తో చాలా తక్కువ సేపు మాత్రమే రాష్ట్రపతి మాట్లాడారని, అదే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో మాత్రం చాలా సేపు మాట్లాడారని అంటున్నారు. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల గురించి వాకబు చేసారా… లేక వారిద్దరికి ఉన్న పాత స్నేహంతో ఎక్కువ సేపు మాట్లాడారా అన్నది మాత్రం ఇదిమిత్థంగా తేలలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాష్ట్రపతి ఫోన్ అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది.











