ఆరోపణలు, విమర్శలు, అవమానాలు, పరాభవాలు, అఖరికి మౌన దీక్షలతో ఘనచరిత్ర కలిగిన విజయనగరం పూసపాటి వంశీయుల రాజరికం రచ్చకెక్కింది. రాజరికాలు అంతరించినా ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రతిష్టాత్మకంగా వ్యవహరించిన విజయనగరం గజపతుల ప్రస్తుత తరం యువరాణుల దుందుడుకు చర్యల వల్ల అప్రతిష్ట పాలవుతున్నారు.
సంచైతతో గుట్టు వీడింది
గోప్యంగా, అంతర్గతంగా సాగిపోతున్న గజపతుల వ్యవహారం మాన్సాస్ ఛైర్ పర్సన్ గా ఆనంద గజపతి మొదటి భార్య కుమార్తె సంచైత నియామకం నుండి బజారున పడింది. ఆమె వ్యవహార శైలి శృతి మించడం , సవతి తల్లిని, చెల్లిని పరాభవించటంతో కాస్త రచ్చకెక్కింది. ఊర్మిళ కుటుంబానికి మద్దతుగా పీవీజీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు, లోక్సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విజయనగరం మెసానిక్ టెంపుల్లో బుధవారం పీవీజీ విగ్రహం ముందు మౌన దీక్ష చేశారు. ఆయనకు ఊర్మిళ, సుధా గజపతి సంఘీభావం ప్రకటించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జిల్లా ప్రజలను సంచైత అవమానించారు : భీశెట్టి
పూసపాటి వంశ ఆడపడుచు పైడితల్లి సిరిమాను ఉత్సవం జరుగుతున్న సమయంలో ఎప్పటిలాగే అమ్మవారి సిరిమాను సంబరం తిలకించేందుకు కోట బురుజు పైకి విచ్చేసిన స్వర్గీయ ఆనంద గజపతి రాజు సతీమణి సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిలా గజపతిరాజు లను అక్కడ నుండి వెళ్లిపోవాలని మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు ఆదేశించడం జిల్లా ప్రజలను అవమానించడమేనని డాక్టర్ పి.వి.జి. రాజు కళావేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు, అమ్మవారి పండుగలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ బుధవారం ఉదయం మెసానిక్ టెంపుల్ వద్దనున్న పివిజీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం మౌన దీక్ష చేపట్టారు.
దెబ్బతిన్న పీవీజీ ప్రతిష్ట
దీక్ష అనంతరం భీశెట్టి మాట్లాడుతూ సంచయిత తీరువల్ల పీవీజీ ప్రతిష్ట దెబ్బతిందని, ఆనంద గజపతిరాజు దేశంలోనే గొప్ప ఎకనమిస్ట్గానే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించారని, రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకత ఉందని, అటువంటి వ్యక్తి కుటుంబాన్ని అవమానించడం సరికాదని భీశెట్టి ఆవేదన చెందారు. సంచైత తీరు మార్చుకోవాలని, ఇప్పటికే మాన్సాస్ సంస్థలు భ్రష్టు పట్టిపోయాయని ప్రజలు భావిస్తున్నారని, రాజుల కుటుంబాల చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవడం మంచిది కాదని అన్నారు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైతకి ఎంతటి హక్కులు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ హక్కులు ఊర్మిలా గజపతిరాజుకు ఉంటాయనే విషయం ఆమె గమనించాలని భీశెట్టి కోరారు. అమ్మ వారి పండుగ ఎలా జరిగిందో చర్చించవలసిన సమయంలో ఇటువంటి పరిణామాలపై ప్రజలు చర్చించాల్సి రావడం బాధాకరమని, సంచైత తన పద్ధతి మార్చుకోవాలి భీశెట్టి హెచ్చరించారు. భీశెట్టి చేసిన మౌన దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కనకల మురళి, శావమిత్రి వేదిక ప్రతినిధులు పతివాడ చంద్రరావు, శ్రీనివాసరావు, రాజారావు, నాగభూషణం, రమేష్, చిరంజీవి, కోరాడ రవి తేజ, నాయుడు,భాస్కర్,ఎర్నిబాబు,కిల్లన మహేష్, ఇప్పల వలస గోపీ,ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
చాలా విచారిస్తున్నాం : ఊర్మిళ
భీశెట్టి దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఊర్మిళ గజపతి రాజు మాట్లాడుతూ విజయనగరం అమ్మవారి ఊరేగింపులో జరిగిన దానికి తాము చాలా విచారిస్తున్నామన్నారు. పీవీజీ రాజు కళావేదిక ఆధ్వర్యంలో బాబ్జీ పీవీజీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేశారని, తాము దానికి సంఘీభావం తెలిపామన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని, ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలగటంపై ఆవేదనతో ఉన్నామని చెప్పారు. ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తాత పీవీజీ రాజు, తండ్రి ఆనంద గజపతిరాజు ఆశయాలు, ఆకాంక్షలు కొనసాగించాలని కోరారు. తాను చెప్పాల్సిన దంత సోషల్ మీడియాలో చెప్పానని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మరోమారు వేడుకున్నారు.
ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం వస్తుందని, సంచైత తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేస్తుందని అశోక్ గజపతి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. రాజకీయం చేయొద్దని ఊర్మిళ వేడుకుంటోంది. ఇది అంతా కుటుంబ వ్యవహారమని, ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేస్తున్నారు. విజయనగరం ప్రజలు మాత్రం ఈ వింత పోకడలపై, ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.











