ఆర్టీసీ సమ్మె కార్మికులకు శాపంగా మారింది. చారిత్రక సమ్మెగా కార్మికులు చెప్పుకుంటున్నా అదే వారిని పాతాళానికి తొక్కేసింది. సాధారణంగా సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కులను కాపాడేందుకు సమ్మెలు చేస్తారు. కానీ కొన్ని సార్లు తిరగబడుతుంది. సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఆర్టీసీ సమ్మె ఓ దశలో సంస్థ ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేసింది. యాజమాన్యం సంస్థను మూసి వేసేందుకు కూడా వెనకాడేది లేదని ప్రకటించింది కూడా. దీంతో కార్మికులు వెనక్కు తగ్గి సమ్మె విరమించడంతో .. ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని సంస్థ బాగు కోసం కార్మికులు కష్టపడాలంటూ సూచించారు. ఇక కార్మిక యూనియన్లకు కూడా సంస్థలో స్థానం లేదని .. ఆర్టీసీలో పనిచేసే వారంతా ఉద్యోగులే నంటూ ప్రకటించారు. సంస్థలో పనిచేసేవారంతా విధులకు హాజరు కావాలని, ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవంలూ స్పష్టం చేసింది యాజమాన్యం.
డిమాండ్లు….అలాగే…
సరిగ్గా సమ్మె చేసి ఏడాది పూర్తయినా తమ డిమాండ్లు నెరవేరలేదు. కార్మిక సంఘాల్లో కూడా ఎలాంటి చలనం లేకుండా పోయింది. సమ్మెను లీడ్ చేసిన టీఎంయూలో అసంతృప్తి రగలుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న థామస్ రెడ్డి తిరుగు బాటు చేశారు. ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామ రెడ్డి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ లో కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని.. సొంత లాభం కోసం యూనియన్ ను సంస్థలు బలి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. సమ్మె ప్రారంభమై ఏడాది గడుస్తున్న ప్రభుత్వంతో కనీసం సంప్రదింపులు చేసేందుకు కూడా అశ్వత్థామ రెడ్డి ప్రయత్నించలేదని.. ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ థమస్ రెడ్డి వర్గం ప్రశ్నిస్తుంది.
మెట్టు దిగకపోతే కష్టమే…
కార్మికుల సంక్షేమం కోసం ఓ మెట్టు కిందకి దిగి సంప్రదింపులు జరపాలి తప్ప ఇలా భీష్మంచుక్కూర్చుంటే ఎలా అంటున్నారు . సమ్మె కాలంలో చనిపోయిన వారిని పరామర్శించే టైం కూడా అశ్వత్థామ రెడ్డికి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులు రోడ్డున పడాల్సిందేనా…
అన్ని విధాల కార్మికుల హక్కులను కాలరాసేప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఒక్క యూనియన్ నేత వల్ల సంస్థలో పనిచేసే 50వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే నేరుగా ఇన్వాల్వ్ అయిన సమయంలో సంస్థ పరిరక్షణ కోసం తన పదవిని వదిలి పెట్టలేడా అని ప్రశ్నిస్తున్నారు.
ముదురుతున్న మాటల యుద్ధం….
టీఎంయూ ఇద్దరు ప్రధాన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.. కార్మికుల బలం చూపించేందుకు పోటీ పడి సమావేశాలు పెడుతున్నారు. సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో ఇలా పోటాపోటీ సమావేశాలు పెట్టుకుని సాధించేదేమీ ఉండదు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి సంస్థ బాగుకోసం పాటు పడాలి. కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకం కాకుండా చూడాలిసిన బాధ్యత ఆ యూనియన్ నేతలపై ఉంది. ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యనేతలు వివాదాలు వీడీ సంస్థను కాపడేందుకు ప్రణాళిలు సిద్ధం చేయాలంటున్నారు కార్మికులు.