అనిశ్చితికి మారుపేరుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 సీజన్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్-20 సీజన్ ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు క్రీడా అభిమానులు ఎక్కువ మంది చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబుతున్నారు. కొంత మంది ముంబై విజేతగా నిలుస్తుందని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పారు.
ఈ సీజన్ లో కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నామని జోస్యం చెప్పారు. తన ఉద్దేశం ప్రకారం ఈ సీజన్ లో ఫైనల్స్ కు ఆర్సీబీ, కోలకతా నైట్ రైడర్స్ జట్లు చేరతాయని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తమ సొంత జట్టు ముంబైని కాదని బెంగళూరుకు సచిన్ ఓటు వేయడం ఆర్సీబీ అభిమానులకు సంతోషాన్ని పంచింది. మరి సచిన్ జోస్యాన్ని కోహ్లీ సేన నిజం చేస్తుందా? లేదా నేటితో తేలనుంది.
అందని ద్రాక్ష
ఐపీఎల్-20 సీజన్ లో మూడవ మ్యాచ్ నేడు దుబాయిలో జరగనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై క్రీడా అభిమానులు అమిత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మొదటి సీజన్ నుంచి స్ట్రాంగ్ టీంగా కనబడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు విజేతగా నిలవలేకపోయింది. బెంగళూరుకు కప్ అందని ద్రాక్షగానే ఉంది. ఈ సీజన్ లో ఎలాగైనా కప్ అందుకోవాలనే ఉద్దేశంతో కోహ్లీ తమ జట్టులో పలు మార్పులు చేశారు.
ఆరోన్ ఫించ్, ఏబీ డీవిలియర్స్, మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, ఫిలిప్, స్టెయిన్, ఆడమ్ జంపా, ఉదాన లాంటి విదేశీ స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ, పవన్ నేగీ, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహమ్మద్ లాంటి బౌలర్లను తీసుకున్నారు. పార్థివ్ పటేల్, శివమ్ దుబే, గురుకీరత్ సింగ్, పవన్ దేశపాండే లాంటి ఆటగాళ్లను కోహ్లీ ఎంపిక చేసుకున్నారు. ‘కాగిత పులులు’గా తమపై పడ్డ ముద్రను చెరపాలని కోహ్లీ సేన కృతనిశ్చయంగా ఉంది.
సన్ రైజర్స్ సత్తా చూపుతుందా
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమతూకంగా ఉంది. గత సంవత్సరం బాల్ టాంపరింగ్ వివాదంతో ఐపీఎల్ కు దూరమైన డేవిడ్ వార్నర్ ఈ సీజన్ కు ఆడటం సన్ రైజర్స్ కు అదనపు బలాన్ని ఇస్తుంది. విలియమ్సన్, బెయిర్ స్టో, అలెన్, నబీ, రషీద్ ఖాన్, మిచెల్ మార్ష్, స్టాన్ లేక్ లాంటి విదేశీ ఆటగాళ్లతో బాటు టీమిండియా ఆటగాళ్లు భువనేశ్వర్, విజయ్ శంకర్, మనీష్ పాండే, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. గత సీజన్ లో సెమీస్ వరకు వచ్చిన హైదరాబాద్ ఈసారి ఖచ్చితంగా సత్తా చాటాలని చూస్తోంది.
ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 15 మ్యాచులు జరగగా 8 విజయాలతో హైదరాబాద్ ముందంజలో ఉంది. బెంగళూరు 6 విజయాలు మాత్రమే సాధించగలిగింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 231 పరుగులు అత్యధిక స్కోరు. ఇరు జట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది.