ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఓవైపు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తూనే.. మరో వైపు ఎన్నికలకు సంబంధించి తమ ఆదేశాలకు కట్టుబడని, సహకరించని అధికారులపైనా అవమానకరమైన వేటు వేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్లు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, వారి పనితీరు బాగోలేదని వ్యాఖ్యానిస్తూ.. అభిశంసన చేయాలని, సర్వీసు రికార్డుల్లో ఇది పేర్కొనాలని ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశకు లోపైన ఏపీ సర్కారుకు ఈ ఆదేశాలు భారీ కుదుపు అని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సంఘం ఆదేశాలు అభిశంసనకు కూడా వర్తిస్తాయా.. లేదా అనేది తరువాతి వ్యవహారం. ఇందుకు చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి ఈ ఆదేశాలు రావడం వారికి నైతికంగా కొంత ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వారు ఆ విధుల్లో కొనసాగేందుకు అనర్హులు అని ఎన్నికల సంఘం చెప్పినా.. బదిలీ అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన తరవాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినా.. ఎన్నికల సంఘం అడ్డుకుంది. వారిని కాపాడేందుకే ప్రభుత్వం బదిలీ చేసిందనే ప్రచారం జరుగుతోంది.
ఇదీ ఇష్యూ..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెబుతూ వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించి తీర్పు నిచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ని ఆశ్రయించగా ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. విచారణలో బాగంగా తాము ఎన్నికల జాబితాను సిద్ధం చేశామని, 2021 జాబితాను ఎన్నికల సంఘానికి ఇస్తామని, అంతా సిద్ధమని, కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందునే వాయిదా కోరుతున్నామని ప్రభుత్వం వాదించింది. తీర్పునకు కట్టుబడి ఉంటామని కూడా హైకోర్టుకు తెలిపింది. విచారణ అనంతరం ఎన్నికల సంఘానికి అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత శనివారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నోటిఫికేషన్ జారీకి ముందే శుక్రవారం రోజున ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు రావాల్సిందిగా వీరిద్దరినీ ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ఉదయం పది గంటలకు రావాలని కోరగా సీఎంతో సమావేశం ఉండడం వల్ల రాలేకపోతున్నామని, మధ్యాహ్నం వస్తామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్లు సమాచారం ఇచ్చారు. దీంతో మూడు గంటలకు వచ్చేందుకు SEC అంగీకరించారు. . అయినా వీరు సమావేశానికి హాజరు కాలేదు. అదే రోజున సాయంత్రం ఐదు గంటలకు రావాలని కూడా SEC ఆదేశించినా రాలేదు. అదే రోజు రాత్రి..ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాల్సిందిగా సీఎస్ నుంచి ఈసీకి లేఖ వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇక నోటిఫికేషన్ రోజున కూడా వీడియోకాన్ఫరెన్స్కి కూడా ఎవరూ హాజరు కాలేదు.
Must Read ;- ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!
ముందే చెప్పిన SEC
కాగా నోటిఫికేషన్ విడుదల సందర్భంగా SEC కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితా ప్రకారం నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అప్పుడే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. సుప్రీం తీర్పు వచ్చాక.. SEC చర్యలు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తూ.. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా రూపొందించడంలో విఫలం కావడం, యంత్రాంగాన్ని ఆ మేరకు సన్నద్ధం చేయించలేక పోవడం, ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోకపోవడం, హైకోర్టులో 2021 ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఇచ్చిన అఫిడవిట్కు కట్టుబడకపోవడాన్ని ప్రస్తావించారు. సర్వీసులో ఈ వివరాలు నమోదు చేయాల్సిందిగా కూడా ఆదేశించారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నందున.. ఆ తరువాత ఓట్లు నమోదు చేసుకున్న దాదాపు3.6లక్షల మంది యువ ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందుకు సదరు అధికారులదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు ఏం జరిగిందని వివరిస్తూ.. (క్రోనాలజీ)ని కూడా ఇచ్చారు.
కాపాడాలనుకున్నా కుదరలే..
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజునే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లడుతూ ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేస్తామని వ్యాఖ్యానించారు. వాస్తవానికి అప్పటికి వీరి బదిలీకి SEC ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు. వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 9మంది అధికారుల (కలెక్టర్లు, ఎస్పీలతో కలిపి)ను బదిలీ చేయాలని ఆదేశించినా ఆ ఆదేశాలు అమలు కాలేదు. కాని సుప్రీంతీర్పు తరవాత SEC చర్యలను ఊహించిన ప్రభుత్వం ఈ ఇద్దరినీ కాపాడాలనుకుందని, బదిలీ చేస్తే ఎన్నికల సంఘం పరిధిలో ఉండే అవకాశం లేనందున చర్యలు తీసుకునే అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి సదరు అధికారులను బదిలీ చేశారని ప్రచారం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం వారిని బదిలీ చేస్తూ సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ SEC నిర్ణయం తీసుకుంది. తరువాత కొన్ని క్షణాలకే ఈ ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలు అమలవుతాయా లేదా అనే విషయం పక్కన బెడితే.. సీనియర్ ఐఏఎస్ అధికారులుగా వారికి నైతికంగా ఇబ్బందికరంగానే ఉంటుందని చెబుతున్నారు.
Must Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!