వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఓడించి తీరుతానని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసరడమే కాదు, గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా రెపరెపలాడించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అయితే స్థానిక వైసీపీ శ్రేణులు మాత్రం గ్రూపు తగాదాలతో కొట్టుకు చస్తున్నాయి. టీడీపీని ఓడించడం తరవాత సంగతి, ముందు వైసీపీలో వర్గవిభేదాలు పరిష్కరించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయట.
నివురుగప్పిన నిప్పులా విభేదాలు
కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు ఈ సభలో బజారున పడ్డాయి. వైసీపీ స్థానిక నాయకులు పోటాపోటీ సభలు పెట్టడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కుప్పం వైసీపీ ఇంఛార్జిగా భరత్, కుప్పం మునిసిపాలిటీ పార్టీ బాధ్యతలు డాక్టర్ సుధీర్ కు అప్పగించారు. అయితే కుప్పం మునిసిపాటీలో సెంథిల్, మురుగన్ వర్గాలు స్థానిక ఎన్నికల్లో కలసి పనిచేస్తారా? లేదా? అనే సందేహం వైసీపీ పెద్దలను వెంటాడుతోందట.
Must Read ;- మంత్రి పెద్దిరెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి జైలుకు!
ఇరకాటంలో మంత్రి పెద్దిరెడ్డి
కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో వైసీపీలో రెండు వర్గాలు ఒకే సారి రెండు సభలు నిర్వహించారు. రెస్కో ఛైర్మన్ సెంథిల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగసభ ఏర్పాట్లు చేసుకున్నారు. సెంథిల్ పెద్దిరెడ్డికి కుప్పంలో ప్రధాన అనుచరుడు కావడంతో మంత్రి కాదనలేకపోయారు. అయితే వన్నెకుల క్షత్రియ వర్గానికి చెందిన మురుగేష్ మార్కెట్ యార్డులో సభ ఏర్పాట్లు చేసుకుని మంత్రి పెద్దిరెడ్డిని ఆహ్వానించారు. కుప్పం నియోజకవర్గంలో వన్నెకుల క్షత్రియుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో రాజకీయ ప్రయోజనాల కోసం మురుగేష్ ఏర్పాటు చేసిన సభకు మంత్రి హాజరయ్యారు. దీంతో కుప్పం వైసీపీలో రెండు వర్గాలను ఏకం చేయడంలో మంత్రి పెద్దిరెడ్డి విఫలం అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
స్థానిక ఎన్నికల్లో కలసి పనిచేస్తారా?
కుప్పం వైసీపీ నాయకులు రెండుగా విడిపోవడంతో మునిసిపాలిటీలో పోటీకి దిగుతున్న డాక్టర్ సుధీర్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. తన గెలుపునకు ఇరువర్గాలు కలసి పనిచేస్తాయా లేదా? అని ఓ వైపు సంశయం ఉన్నా.. మంత్రి పెద్దిరెడ్డి అండతో ఎలాగైనా కుప్పంలో గెలచి తీరాలని సుధీర్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కుప్పం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలు కౌవశం చేసుకోవాలని వైసీపీ అధినేత స్పష్టంగా ఆదేశించారని, అందుకే పెద్దిరెడ్డి ఎంత బిజీగా ఉన్నా కనీసం నెలకు ఒకసారైనా కుప్పంలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి రుచి చూపించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.
Must Read ;- హల్ చల్ : ‘నేను సీఎం జగన్ రెండో భార్యని’











