స్థానిక ఎన్నికలు కీలక దశలో ఉండగా పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్ఈసీ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ముఖ్యమైన అధికారులను బదిలీ చేయడం తగదని ఎస్ఈసీ నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎవరైనా అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే మాత్రం ఎన్నికల విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.
కీలక అధికారుల బదిలీ వెనుక..
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సమయంలో ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ అధికారులను తప్పిస్తే కొత్తగా వచ్చేవారు స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో విఫలం అవుతారని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే ఈ నెపాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై నెట్టాలనే వ్యూహంతోనే ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. అయితే, అధికారుల బదిలీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
బదిలీ చేసింది ఎవరు?
పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఎంతమందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం అని ప్రకటించారు. అంటే పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం కాదా? ఎన్నికల సంఘం అధికారులను నేరుగా బదిలీ చేయలేదు. అధికారులను బదిలీ చేయాలని సీఎస్ను కోరడం మాత్రమే చేయగలదు. కానీ ఈ బదిలీలకు నిమ్మగడ్డే కారణం అనే విధంగా ప్రజల్లో ఓ అభిప్రాయం వచ్చే విధంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తావిస్తోంది.
Must Read ;- చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?