ఆయన లేని గీతం… పల్లవి లేని పాట.
ఆయన లేని రాగం… చలనం లేని చరణం.
ఆయన లేని తాళం… మూగబోయిన మౌనం
పాట అలిసిపోయింది. పాట మూగబోయింది. పాట వెళ్లిపోయింది. గాన గాంధర్వుడిగా పిలుచుకునే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం దేవుడి ముందు పాడడానికి వెళ్లిపోయారు. కరోనా కాటుకు బలైపోయారు. 40 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం “నీది కర్కశత్వం. నాది మృదుత్వం. అందుకే నేను తప్పుకుంటున్నాను “ అని కరోనాకు శరీరాన్ని అప్పగించి ప్రాణాలను తెలుగు వారికి వదిలేసి వెళ్లిపోయారు.
అబ్బే.. అతనేం పెద్ద పాటగాడు కాదు. గుండెలు పిండేసే సంగీతకారుడూ కాదు. ఊరికే అలా ఓ పాట పాడి మనల్ని కుదురుగా ఉండనివ్వడు. అంతే. శ్రీ క్రిష్ణుడు గోపికలను మార్చినంత సులువుగా అతను గొంతులు మార్చేస్తాడు. పాట వింటూంటామా… తెర మీద కనిపిస్తున్న నటుడే పాడుతున్నాడేమోనని భ్రమ పడతాం. భక్తి పాటలు కూడా పాడిన ఆ పాటగాడి సొంత గొంతు అదిగో… అప్పుడే మనకు ఎరుకవుతుంది. అంత వరకూ మనం తెర మీద బొమ్మలే పాడుతున్నాయనుకుంటాం.
అయితే ఈ మధ్య తెలుగు వారందరికీ తెలిసిపోయిందనుకోండి. ఆ పాటగాడి గురించి. అందుకే ఓ అనారోగ్యం అతడ్ని వెంటాడుతూంటే అందరూ ఇంట్లో వారికి ఏమైందో అన్నంత కలవరపాటుతో ఉన్నారు. ఇంతకీ ఆ పాటగాడు ఎవరో చెప్పలేదు అనుకుంటున్నారా… ఇంకెవరూ. వివిధ నామాలతో ప్రేమగా పిలుచుకునే ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం. ఎస్.పీ.బాలు. ఎస్.పి. గానగంధర్వుడు.
ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు ఏం చేయాలి. శుభ్రంగా ఉద్యోగం చేసుకోవాలి. అయితే, ఊళ్లేలాలని ఉంది కదా. అందుకే ఉద్యోగం… సద్యోగం కాదని మైకు అందుకున్నాడు ఈ ఇంజనీరింగ్ కుర్రాడు. ఎప్పుడంటారా. తన 23 ఏట. బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు నెరజానుడు. సొంతూరికి ఆనాటి మద్రాస్… నేటి చెన్నైకి ఓ పాసింజర్ రైలెక్కి వెళ్లిపోయాడు బాల సుబ్రహ్మమణ్యం పాట కోసం. అప్పటికి ఘంటశాల వారిదే పాటల సామ్రాజ్యం. ఆ మర్రిచెట్టు నీడలో ఏ చిన్న మొక్కా నిలవలేకపోయాయి.
నేను పాడలేను బాబో అని ఘంటశాల ఎంత మొరపెట్టుకున్నా… మేం మీ కోసం వేచి చూస్తాం అనే వారే తప్ప కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చే వారు కాదు… ఆనాటి నిర్మాతలు. కాళ్లు అరగలేదు కాని… గొంతు అరిగిపోతుందమోననే భయం వెంటాడింది బాలునీ ఆ సమయంలో. అప్పుడే ఓ మిరాకిల్ జరిగిందట. దేవుడికి తనపై రాసిన పాటలు తన ఎదురుగానే పాడించుకోవాలనిపించి ఘంటశాల గారిని తీసుకెళ్లోపోయాడని ఘంటశాల గారి అభిమానులు అనుకుంటారు.
ఘంటశాల గారు వెళ్లిపోయాక బాలుకి అవకాశం వచ్చిందనుకుంటున్నారా. ఆయనుండగానే వచ్చింది. పైగా అంతటి గాయకుడితో కలిసి పాడే అవకావమూ వచ్చింది. ఎందులో అంటారా. ఏకవీర చిత్రంలో. అది కూడా ప్రతీ రాత్రి.. వసంత రాత్రి పాటతో. ఎటొచ్చి పేద్ద పేరే రాలేదు. ఘంటశాల గారు సెలవంటూ వెళ్లిపోయాక కూడా పెద్దగా అవకాశాలు లేవు. ఆ సమయంలో తెరను ఏలింది రామక్రిష్ణ. ఘంటశాల గాత్రానికి ఇంచుమించు సరిపాటి… అంటే బ్రూ కాఫీలా అన్నమాట… రామక్రిష్ణ రాజ్యం కొనసాగింది.
రాఘవేంద్రుడు, దాసరి నారాయణ రావు, కే.విశ్వనాథ్, బాపుతో మరికొందరు మాస్ దర్శకులు రాగానే హాత్తెరికి… ఎవరి సినిమా అయినా పాటలన్నీ ఒకేలా ఉన్నాయి. ఇలా ఉండకూడదెస్ అనుకుని ఎస్.పీ.బాలుకి అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. కుర్రాడిలో టాలెంట్ ఎక్కువ కదా… అలా వచ్చి ఇలా అల్లుకుపోయాడు. ఎంతలా అంటే… ఒకప్పుడు ఘంటశాల మాస్టారు నన్ను వదిలేయండి మహాప్రభో ఇక పాడలేను అన్నంతలా బాలు కూడా నన్ను వదిలేయండి అనే స్థితికి వచ్చారు.
ఎన్టీఆర్ జయప్రద తుంటి మీద కొడుతూ యమగోలలో పాట పాడితే ఆ తుంటి మీద కొట్టింది బాలు అనుకున్నారంతా… కంచికి పోతావా క్రిష్ణమ్మ అంటూ బిర్లామందిర్ ముందు డాబా మీద మడత మంచంలో పడుకుని చంద్రమోహన్ పాడుతూంటే అక్కడా బాలుయే పడుకున్నారనుకున్నారు. వంకర్లు పోతూ అల్లు రామలింగయ్య ముత్తాలు వస్తావా.. అడిగింది ఇస్తావా అని అడుగుతూంటే అల్లు రామలింగయ్యకి నటనతో పాటు పాటలూ వచ్చా అనుకుని ముక్కున వేలేసుకున్నారు. తీరా ఆ పాటని బాలు పాడారని తెలిసి ఆ మిమిక్రీకి మురిసి ముక్కలయ్యారు.