‘అమ్మ’ ఓ కమ్మని మాట.. మరి బొమ్మ.. కల(ళ)ల బాట. బొమ్మ అనగానే బాపు గుర్తొస్తారు.. ఆ తర్వాత ఇంకెవరు అంటే చంద్ర తప్ప మరో మాట వినపడదు. చిత్ర కళా ప్రపంచానికి బాపు సూర్యుడైతే చంద్ర ఓ పున్నమి చంద్రుడు. పున్నమి రోజున పుట్టడం వల్లనేమో ఆయన పున్నమి చంద్రుడిలా ‘వెలిగి’పోయారు. చంద్ర లేరని తెలిసి కుంచె కూడా కన్నీళ్లెట్టుకుంటుందేమో.
చంద్ర అసలు పేరు మైదం చంద్రశేఖర్. సొంతూరు వరంగల్ జిల్లా ధన్నాసరి. ఆయనలో అనేక కళలున్నాయి. చిత్రకారుడు, రచయిత, కళాదర్శకుడు, కార్టూనిస్ట్, కథకుడు, నటుడు.. మంచి మనీషి. ఈయన కళ నచ్చి బి. నరసింగరావు తన ‘రంగుల కల’లో ఆర్టిస్టు పాత్రనే ఇచ్చారు. చంద్ర కాన్వాసు మీద వెలిగిపోయిన బొమ్మలు ఒకటా రెండా వేలకు వేలు. ఎవరైనా కథ రాస్తే చంద్ర బొమ్మ ఉండాల్సిందే. అప్పట్లో అనేక పత్రికలకు ఆయనే ఆస్థాన చిత్రకారుడు.. ఆ స్థానం భర్తీ చేయలేని కలం వీరుడాయన. ‘చూపుల ద్వారా స్వాహా చేసి దృశ్యాలను వేళ్ళ చివర్ల కుంచెల ద్వారా ప్రపంచాల అంచుల వరకూ విసిరేసిన ప్రముఖుల్లో ఒకరని ఆయన గురించి ఎవరైనా చెబుతారు.
ఆయన కళల పయనం సాగెనిలా..
చంద్రది వ్యవసాయ కుటుంబమే. నాన్న ఆజాంజాహి మిల్లులో ఉద్యోగం. చంద్ర చిన్నప్పుడు వరంగల్ లోనే ఉండేవారు. నాన్నకి ఉద్యోగం ఆప్కోలో రావడంతో ఆ కుటుంబం మకాం హైదరాబాద్ కు మారింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా.. చంద్ర చిన్నప్పుడే బాత్ రూమ్ లో గోడ మీద బొగ్గుతో బూతు బొమ్మ వేసేశారు. అది చూసి ‘అమ్మ నా కొడకా’ అంటూ వాళ్ల నాయన ఆయన వీపు చీరేశారట. చంద్రకు కావలసింది ఆ బొమ్మ వేయడం.. అందులో బూతు ఉందన్న సంగతే ఆయనకు తెలియని వయసది. హైదరాబాద్ లో పల్ల దుర్గయ్య ఇంట్లో అద్దెకు దిగారు. ఆయన ఉస్మానియాలో తెలుగు అధ్యాపకులు.

ఇరుగుపొరుగున ఉన్నది ఎవరనుకుంటున్నారు.. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరధి, జర్నలిస్టు చక్రవర్తి రంగస్వామి.. మరి వారందరి గాలి చంద్ర మీద సోకుకుండా ఎలా ఉంటుంది. లైబ్రరీకి వెళ్తుంటే ఆంధ్ర పత్రికతో అనుబంధం ఏర్పడింది. అందులోని బాపూ బొమ్మలే చంద్రకు చిత్రలేఖనం పాఠాలయ్యాయి. అలా పీయూసీ చదివేటప్పుడే ఓ బొమ్మ వేసేసి పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈలోగా ప్రిన్సిపల్ నుంచి కబురొచ్చింది. బొమ్మ బాగా వేశావని మెచ్చి మేకతోలు కప్పుతారని చంద్ర భావిస్తే అక్కడ అవమానం ఎదురైంది. తన బొమ్మను కాపీ కొట్టారంటూ న్యాయనిర్ణేతల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ కోప్పడ్డారు. తాను కాపీ కొట్టలేదని ఎంత చెప్పిన వినరే. ఆ అవమాన భారం తట్టుకోలేకపోయారు చంద్ర.
‘నిందలు వేసిన చేతులతోనే దండలు వేయించుకుంటాను’ అంటూ శపథం చేసుకున్నారు. పీయూసీ పాసైతే డాక్టర్ కోర్సులో చేర్పించేస్తారని కావాలనే పరీక్ష తప్పారు. పరీక్షల్లో తప్పినా ప్రేమలో మాత్రం పాసయ్యారు. తనకన్నా వయసులో పెద్దదైన టీచర్ తో ప్రేమలో పడ్డారు. ఇంట్లో ఇష్టంలేకపోయినా ఆమెతో వేరు కాపురం పెట్టారు. ఫైనార్ట్స్ కాలేజీలో చేరి చదువుకుంటూనే ఇంకో పక్క పత్రికలకు బొమ్మలు వేసేవారు. అలా రెగ్యులర్ గా ‘యువ’ పత్రికకు బొమ్మలు వేసేవారు. అప్పట్లో వచ్చే ప్రతి పత్రిక నుంచి కూడా బొమ్మల కోసం చంద్రనే అడిగేవారు. రంగనాయకమ్మ, తురగా కృష్ణమోహన్, నెల్లూరు కేశవరావులాంటి రచయితలు కథలు రాస్తే బొమ్మలు చంద్రతోనే వేయించుకునేవారు. అలా ఆయా కథలతో పాటు చంద్ర పేరు కూడా జనంలోకి వెళ్లిపోయింది.

బాపు తర్వాత ఎవరంటే చంద్ర అనే అనేవారు ఎవరైనా. న్యూవేవ్ రైటర్స్ లో చంద్ర కూడా ఒకరు. 150కు పైగా కథలు రాశారు. యర్రంశెట్టి శాయి, పమ్మి వీరభద్రరావుతో కలిసి గొలుసు నవల కూడా రాశారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు, మంచుపల్లకీ, తరంమారింది, ఓ అమ్మకథ, డిటెక్టివ్ నారద లాంటి దాదాపు పాతిక చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. 40 ఏళ్ల వయసులో అంబేద్కర్ యూనివర్శిటీలో ఆర్టిస్ట్ గా చేరారు. బాపు లాగా సినిమాలకు దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉన్నా అది మాత్రం నెరవేరలేదు. రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇంద్రధనుస్సు,వెన్నెలవేట మొదలైన టి.వి. సీరియల్స్ను కూడా రూపొందించారు.నాలుగు అక్షరాలు రాయడానికే ఆపసోపాలు పడే జనాలున్నరోజులివి. అలాంటిది వేలకు వేల బొమ్మలు వేయడం అంటే మాటలా.. అమ్మో అనేస్తారు ఎవరైనా.. కానీ చంద్ర అలా అనలేదు తన షష్టిపూర్తి రోజు కూడా ఇంకో అరవయ్యేళ్ల పాటు బొమ్మలు వేస్తూనే బతకాలని ఉందన్న కోరికను వ్యక్తం చేశారు. ప్రజాచిత్రకారుడైన చంద్ర అర్ధాంతరంగానే తనువు చాలించారు.
భగీరథంపై వెలిగిన ‘చంద్ర’కలం
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాసిన తొలి పుస్తకం ‘మానవత’ కవర్ పేజీపై చంద్ర ‘కలం’ ఆయనలోని కళకు ఓ మచ్చుతునక. చంద్ర మరణవార్త ఎందరినో కలవరపర్చింది. వారిలో భగీరథ కూడా ఒకరు. చంద్ర కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు కథకుడు, నటుడు, కళా దర్శకుడు, అన్నింటికీ మించి మంచి మిత్రుడు అంటారు భగీరథ. ఎందరో వర్ధమాన చిత్రకారులకు ఆయన ప్రేరణగా చెబుతారు.
చంద్రతో తనకు 1975 నుంచి పరిచయం ఉందని భగీరథ చెప్పారు. ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ ఇంట్లో ఉండే సమయంలోనే భగీరథ అయన్ను కలిశారట. అమ్మాయిల బొమ్మలను నాజూకుగా గీయడంలో చంద్ర తనకు తానే సాటి అని జనం అనుకుంటుండేవారంటారు భగీరథ. చంద్ర కుంచె ఆగిపోయినా.. గతంలో ఆయన గీసిన చిత్రాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భగీరథ నివాళులర్పించారు.











