జగన్ రెడ్డి పై పేరడి పాటలతో నిరసనలు..!
జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై విడుదల చేసిన చీకటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. 13 జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి ఉపాధ్యాయులు సై అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో జిల్లా ప్రధాన కేంద్రాలకు చేరుకుని, కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని జిల్లాలో ఉపాధ్యాయలు ‘పుష్ప’ సినిమాలోని పాటలను పేరడి చేసి.. జగన్ రెడ్డిపై సంధించారు. ‘‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే సాంగ్ తో దుమ్ములేపారు. ఎవడ్రా .. ఎవడ్రా నీవు .. టీచర్ .. టీచర్ .. నేను.. నన్ను తాకితే తొక్క తీస్తాను ..’’ అంటూ పాఠాలు చెప్పే గురువులు గుణపాఠాల పేరడితో నిరసనలు తెలియజేశారు. మరోచోట మహిళా ఉపాధ్యాయనీయులు ‘‘ఇంతన్నాడు అంతన్నాడే జగన్, అయ్యయ్యో వద్దమ్మా.. పక్కనే సీఎం ఉన్నాడు.. పెద్ద పీఆర్సీ ఇస్తానన్నాడు.. ఇప్పుడు రాష్ట్రంలో అప్పుల్లో ఉందన్నాడు.. మా దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు.. సుఖీభవ.. సుఖీభవ’’ అంటూ పేరడీ పాటలకు కోరస్ అందుకుంటూ నినదించారు. ఇప్పుడు ఈ పాటలే.. సోషల్ మీడియా తెగ వైరల్ గా మారాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంస జల్లులు..!
ఫ్యాప్టో పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కదం తొక్కారు. 13 జిల్లాలో ఉన్న కలెక్టరేట్స్ ముట్టడికి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు కదిలి వచ్చారు. కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు సినిమా పాటలతో చేసిన పేరడీ చేసి పాడిన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. డబ్బు వాయిద్యాలతో దద్దరిల్లేలా వివిధ పాటలను పాడి నిరసన ఉద్యమంలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఇటీవల ఇచ్చిన పీఆర్సీని గుర్తు చేసుకుంటూ..టీచర్స్ పాడిన పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఫ్యాప్టో తెలిపిన నిరసనలను ప్రశంసిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో ఒక రేంజ్ లో అసంతృప్తి ఉంటేనే.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న నిరసనలకు ఈ స్థాయిలో అశేష మద్దతు లభిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Must Read:-జగన్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు రోడ్డెక్కిన గురువులు! ఉద్యమించిన ప్యాఫ్టో!!