గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్షాక్ తగిలింది. ఇటీవల బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన వంశీకి..ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండేలా కనిపించడం లేదు. మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు మే 29న ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అక్రమ మైనింగ్ కేసులో గతంలో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం వాదనలు వినకుండానే వంశీకి హైకోర్టు వెంటనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. జస్టిస్ పీవీ సంజయ్కుమార్, జస్టిస్ సతీష్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ తర్వాత ప్రభుత్వం వైపు వాదనలు వినకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం సరి కాదని స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులు పక్కన పెడుతున్నట్లుగా స్పష్టం చేసింది. మళ్లీ ఇరు వర్గాల వాదనలు విని..మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే కేసు మెరిట్స్ లోకి..పీటీ వారెంట్స్ అంశాల్లోకి వెళ్లడం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలుకు వారం రోజులు..ప్రభుత్వం సమయం కోరింది. ఆ తర్వాత నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది.
ముందస్తు బెయిల్ రద్దు కావడంతో..వల్లభనేని వంశీని అరెస్టు చేయడానికి పోలీసులకు అవకాశం ఉంది. గతంలో పీటీ వారెంట్ జారీ చేశారు. కానీ ముందస్తు బెయిల్ రావడంతో దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అరెస్టు చేయవచ్చు. కానీ పోలీసులు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ పూర్తయ్యే వరకూ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భావిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ జగన్ ను కలవడం.. వైసీపీ తరపున రాజకీయాలు చేస్తాడని..పేర్ని నాని వంటి వాళ్లు ప్రకటిస్తూండటంతో ఏమైనా జరగవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.











