మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా.. ప్రభుత్వానికి తమ కోరికను నివేదించవచ్చు. తమ నిరసనను వినిపించవచ్చు. మెజారిటీ అభిప్రాయానికి మన్నన ఉంటుంది. సాధారణంగా మనం ప్రజాస్వామ్యం అంటే ఇంతే అనుకుంటాం. కానీ.. కార్యరూపంలో ఇది ఇవాళ్టి రోజుల్లో ఎలా ఉన్నదంటే.. ఒకసారి ఓటు వేయడం ద్వారా ప్రజలు ఒక పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత.. ఇక అయిదేళ్ల పాటు ప్రజల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఉండదు. వారు ఎన్నుకున్న పార్టీకి మాత్రమే ఆ విలువ ఉంటుంది. మన దేశంలో ఉన్న వ్యవస్థ ‘ప్రజాస్వామ్యం’ లాగా కాదు, అయిదేళ్లకోసారి చేతులు మారే నిరంకుశత్వం లాగా మాత్రమే చెలామణీ అవుతోంది. అటు కేంద్రంలో గానీ, ఇటు రాష్ట్రాల్లో గానీ కనిపిస్తున్న పరిణామాలు ఇలాంటి పోకడలకు తార్కాణాలే.
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పటినుంచి ఆయన రాజ్యాధికారమే నడుస్తోంది. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం నాది అని జగన్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తాను ఇచ్చిన కొన్ని హామీలను అచ్చంగా అమల్లో పెట్టడం ద్వారా ఆయన అలాంటి పేరు తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో తేడా జరిగింది. అమరావతిగా రాజధాని ఎంపిక చేసినప్పుడు జగన్ సభలో దానికి మద్దతిచ్చారు. ఆ తర్వాతికాలంలో ఆయన తాడేపల్లిలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు.. ఎవ్వరికీ ఎలాంటి సంశయం లేకుండా పోయింది.
కానీ, ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే.. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే ఒక ప్రచారం జరిగింది. జగన్ ఆ ప్రచారంపై పెదవి విప్పలేదు. స్థానిక అభ్యర్థుల విజయావకాశాలు డోలాయమానంగా మారినప్పుడు, వారు ప్రత్యేకంగా కోరినా కూడా.. అమరావతి రాజధాని గురించి ఆయన ప్రచార సభలో పెదవి విప్పకుండా జాగ్రత్త పడ్డారు. అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో పునరాలోచన చేస్తారనడానికి బహుశా అది నాంది. అనుమానించినట్టుగానే.. అధికారంలోకి రాగానే.. అమరావతి ఉసురుతీసి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు.
మూడు రాజధానులు పైపై మాటలే
జగన్మోహన్ రెడ్డి సర్కారు- తాము రాజధానిని తరలించడం లేదని, కేవలం అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికోసం వికేంద్రీకరిస్తున్నామని మాత్రమే అంటుంది. కానీ, ఇవన్నీ పైపైమాటలే అన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. విశాఖపట్టణంలో తలపెట్టిన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఒక్కటే నిజం. మిగిలిన రెండు రాజధానులు మిధ్య! విశాఖలో సెక్రటేరియేట్ తో పాటు ఒక అసెంబ్లీ కూడా ఉంటుంది. అమరావతికి అది ఒక ప్రమాదసూచిక కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘ఒప్పుకోలు’ అవసరం కూడా ఉన్న కర్నూలుకు హైకోర్టు తరలింపు అనేది అం సింపుల్ సంగతేమీ కాదు. మొత్తంగా చూసినప్పుడు.. రాజధాని మొత్తంగా విశాఖకు తరలిపోతున్నట్టే లెక్క. ‘‘మూడు చోట్ల ఉంటుంది.. సమాన అభివృద్ధి జరుగుతుంది’’ అనే మాటలన్నీ నమ్మశక్యాలు కావు.
రైతుల వేదన..
అమరావతి రైతులు రాజధాని తరలిపోవడానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం వారి భయాలను నివృత్తి చేయాలి. అమరావతి రైతులు అనేక రకాల ఆందోళనలకు పూనుకున్నారు. అనేక మందిని కలిశారు. నివేదించుకున్నారు. ఘెరావ్ లు చేశారు. చాలా చాలా చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనల పట్ల ఒకే తరహా స్పందనను కనబరిచింది.
వారి పోరాటాను ఆందోళనలను పట్టించుకోకుండా వదిలేసింది.
ఇది చాలా అవమానకరం. వారి పోరాటాలను ప్రభుత్వ పట్టించుకుంటే.. పిలిచి మాట్లాడాలి. వారు చేస్తున్నది తప్పు అని భావిస్తే.. ఆ పోరాటాలను అణిచివేయాలి. తొక్కేయాలి. కానీ ఈ రెండూ జరగలేదు. తొలిరోజుల్లో పల్లెల్లో పోలీసు కవాతులు వంటి చర్యల ద్వారా అమరావతి ప్రాంత గ్రామీణులను బెదిరించడానికి ప్రయత్నించిన సర్కారు తర్వాత వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది. ఇది శిక్షించడం కంటె పెద్ద బాధ.
ఒక సినిమాలో హీరో- హీరోయిన్ వెంటపడుతుంటాడు. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నా.. తిరస్కరించినా పరవాలేదు. కానీ.. నేను ప్రేమిస్తున్నాననే సంగతి గుర్తించు చాలు.. అని పదేపదే అడుగుతుంటాడు. ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక.. ప్రజల డిమాండ్లను తీర్చడం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. ఇష్టం ఉండకపోవచ్చు. అయితే వారి ఆందోళనను, పోరాటాన్ని అసలు గుర్తించకుండా ఉండిపోవడం అనేది ఏప్రభుత్వానికీ మంచిది కాదు.
ఇది తగని పని..
అమరావతి ప్రాంతం మొత్తం ఒక కులం వారికి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే జరిగిన ప్రయత్నంగా పదేపదే అభివర్ణించడం ద్వారా.. ఏపీ ప్రభుత్వం.. కులాల మధ్య స్పష్టమైన గోడలు కట్టేసింది. ఆ కులం కష్టాలు వినడం కూడా నాకు అసహ్యం అన్నట్లుగా వారిని గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఆ విషయాన్ని నిరూపించడానికి వారు అనేక రకాలుగా తమ వంతు ప్రయత్నం చేశారు కూడా. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాత్రం వారి మీద కులం ముద్రను మరింత బలంగా పులమడానికి చూసింది. అమరావతికి అనుకూలంగా ఎవ్వరు మాట్లాడినా.. కులం కళ్లజోడులోంచిచ వారిని చూడడం, కులం ప్రభావం తూకం రాళ్లపై వాళ్ల మాటలను బేరీజు వేయడం ప్రారంభించింది.
రాజకీయ పార్టీలు- కుల పార్టీలుగా ముద్ర పడడం తెలుగునాట ఎప్పుడో జరిగింది. ‘తమ’దైన పార్టీ లేని కులాలు అనాథ కులాలుగానే మిగిలిపోయాయి. గతిలేదు గనుక, వారు ఏదో ఒక కులాన్ని ఆశ్రయించి బతుకుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం మరింత దిగజారిపోయేలా కులం ముద్రతో రాజధానిని చూడడం జరుగుతోంది. ఒక డిమాండ్ తో మూడు వందల రోజులనుంచి ఒకే రీతిగా గళమెత్తుతున్న ఆందోళనల్ని, ఉపేక్షించి, నిర్లక్ష్యం చేసి అడుగులు వేయడం తగని పని అని ప్రభుత్వం గుర్తించాలి. న్యాయ పరమైన ఇబ్బందులు లేనప్పుడు.. న్యాయవ్యవస్థ తుదితీర్పులకు లోబడి నిర్ణయాలు ఉండాలి, ఉంటాయి. కానీ, ఆలోగా అమానుష వైఖరి ప్రదర్శించడం మంచిది కాదు.
.. సురేష్ పిళ్లె











