అమరావతి రాజధాని ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాయపూడిలో నిర్వహిస్తోన్న జనభేరి సభకు టీడీపీ నేతలు హాజరు కాకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అర్థరాత్రి నుంచే టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల పహారా పెట్టారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు. పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్ అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావును హౌస్ అరెస్ట్ చేసి అమరావతి జనభేరి సభకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో టీడీపీ నేతలు అమరావతి జనభేరిలో పాల్గొనవద్దంటూ పోలీసులు 41 సీ నోటీసులు జారీ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రయత్నించినా జనభేరి సభ విజయవంతం అవుతుందని, అమరావతిని సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జవహర్కు పోలీసులు గృహ నిర్భందం చేశారు. అమరావతి జనభేరిలో పాల్గొనాడానికి వీల్లేదని నోటీసులు జారీ చేశారు.సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును గుంటూరులో హౌస అరెస్ట్ చేశారు. రాజధాని ఉద్యమంలో పాల్గొంటారని భావించిన ప్రతి నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబునాయుడిని కూడా అడ్డుకుంటారా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాయపూడి జనభేరి సభకు హాజరు కాకుండా అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను అమరావతి జేఏసీ ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి తప్పుపట్టారు. అమరావతి జనభేరి సభకు హాజరయ్యేందుకు రెండు రోజుల కిందటే మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఉండవల్లి చేరుకున్నారు. అయితే ఇవాళ జరిగే జనభేరికి హాజరు కాకుండా చంద్రబాబు నివాసం వద్ద పెత్త ఎత్తున పోలీసులను మోహరించడంతో సందేహాలు కలుగుతున్నాయి.
అమెరికాలో అమరావతి నినాదాలు
అమెరికాలోనూ తెలుగువారు అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటోన్న తెలుగు ప్రజలు వాషింగ్టన్, చికాగో, కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దుతు ఉంటుందని ఎన్ఆర్ఐలు ప్రకటించారు.
Must Read ;- నలుదిక్కుల ప్రతిధ్వనించనున్న రాజధాని జనభేరి!