అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఇవాళ రాయపూడిలో చేయతలపెట్టిన జనభేరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలను రాజధాని జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఉదయం గం.11 నుంచి సాయంత్రం గం.4 వరకు సభ జరుపుకునేందుకు పోలీసులు కూడా అనుమతించారు. అయితే సభలో కొన్ని అరాచక శక్తులు హింస పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. జనభేరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. 13 జిల్లాల నుంచి వేలాది మంది ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.
విజయవాడ నుంచి రాయపూడి జనభేరి సభకు తరలివెళుతున్నారు. ఈ సభకు కనీసం 30 వేల మంది రాష్ట్రం నలుమూలల నుంచి హాజరవుతారని అమరావతి జేఏసీ తెలిపింది. అమరావతి ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజధాని ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా ఇవాళ జనభేరిలో స్పష్టత రానుంది. ప్రభుత్వం దిగిరాకుండా ఢిల్లీ రైతుల తరహాలో ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాలని రైతులు భావిస్తున్నారు.
Must Read ;- అణచివేతలు అరెస్టుల మధ్య ప్రారంభమైన జనభేరి
హాజరుకానున్న ప్రముఖులు
అమరావతి జనభేరి సభకు పలు పార్టీల నుంచి ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, వామపక్షాల కార్యదర్శులు మధు, రామకృష్ణతో సహా దళిత సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులతో సహా వందలాది మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
అలజడి రేపుతారా?
ఓవైపు ఏకైక రాజధాని అమరావతి కోసం రైతులు సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తుంటే మరోవైపు మూడు రాజధానులు కావాలంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కొందరు టెంట్లు వేసుకుని రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు. ఇవాళ రాజధాని గ్రామం రాయపూడిలో భారీ బహిరంగ సభ జరగనుండంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. అరాచక శక్తులు రాజధాని ఉద్యమంలో అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. దీనిపై సర్వత్రా ఉత్కఠ నెలకొంది.
Also Read ;- అమరావతి.. నిన్నటి స్వప్నం, నేటి ఉద్యమం, రేపటి వాస్తవం!











