అది రెండు పెద్ద నగరాల మధ్య విస్తరించిన ప్రాంతం. దాదాపు 14.50 చదరపు కిలోమీటర్ల పరిధిలోని పచ్చటి ప్రాకృతిక వనం. రాష్ట్రానికి నడిబొడ్డు లాంటి ప్రదేశం. అన్ని ప్రాంతాలకు సమదూరం కలిగి ఉండడం దీని ప్రత్యేకత. అందుకే నాటి ప్రభుత్వాధినేత, నవ్యాంధ్ర ఆశాజ్యోత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రుల కలల రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంపికచేశారు. దివినున్న ఆ అమరావతిని భువికి దింపే అసామాన్య యత్నానికి అంకురార్పణ చేశారు. రూ. 16 వేల కోట్లు లోటులో ఉన్న రాష్ట్రానికి.. రాజధానినే ఆదాయ వనరుగా మార్చే యత్నం చేశారు.
ఏమీ లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మించాలంటే మాటలా! ఎంత సంకల్ప బలం కావాలి! ఏ స్థాయిలో ఆత్మ స్థైర్యం ఉండాలి! ఎంతటి ముందు చూపు కావాలి! ఇవన్నీ పుష్కలంగా ఉన్న చంద్రబాబు.. తన అనుభవాన్నంతా రంగరించి రాజధానికి పురుడు పోశారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా 33వేల ఎకరాలను సేకరించి.. దేశాన్ని అబ్బుర పరిచారు. తెలంగాణలో ఓ చిన్న ప్రాజెక్టు కోసం కేవలం వంద ఎకరాలు సేకరించడానికే అక్కడి ప్రభుత్వం ఆపసోపాలు పడ్డ సంగతి తెలిసిందే. చివరికి ఈ విషయం కాల్పుల వరకు దారితీసింది. కానీ, మన దార్శనిక నేత.. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు సేకరించి.. పక్క రాష్ట్రాధినేతలకు కన్నుకుట్టేలా చేశారు.
త్యాగమూర్తులు.. మన అమరావతి రైతన్నలు
నవ్యాంధ్ర కలల రాజధాని సాధనకు మన అమరావతి రైతన్నలు చేసిన త్యాగం నిరుపమానం. దేశంలోనే అత్యున్నత రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు సంకల్పానికి చేదోడుగా వారు కదిలిన తీరు అనిర్వచనీయం. వేల కోట్ల రూపాయలు విలువ చేసే 33 వేల ఎకరాల సిరులు కురిపించే భూమిని.. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా.. చంద్రబాబుపై పూర్తి నమ్మకంతో ప్రభుత్వానికి అప్పగించారు. చంద్రబాబు కూడా రైతన్నల నమ్మకానికి తగినట్టుగానే అడుగులు వేశారు. కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లభించకున్నా.. తన మేధస్సుతో వేల కోట్ల రూపాయల నిర్మాణాలకు అంకురార్పణ చేశారు. రాజధానికి ఓ రూపు తీసుకొచ్చారు. పరిపాలనా యంత్రాంగం మొత్తాన్ని అమరావతికి తీసుకొచ్చారు. కేవలం చంద్రబాబుపై నమ్మకంతో.. వేల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. అమరావతి ఉధృతిలో పక్క రాష్ట్రాలు తేలిపోయాయి.
Must Read ;- అజరామరం.. అమరావతి
అంతా బాగుంది.. అనుకుంటున్నంతలోనే..
అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. భూములిచ్చిన రైతులు ఆనందంగా ఉన్నారు. తమ గ్రామాల్లో జరుగుతున్న భారీ నిర్మాణాలను చూసి అబ్బుర పడిపోతున్నారు. కలల రాజధాని నిర్మాణం వైపు ప్రజలు సంతృప్తిగా చూస్తున్నారు. ఇంతలోనే.. చాపకింద నీరులా వ్యతిరేక ప్రచారం మొదలైంది. రాజధానిలో అసలు నిర్మాణాలు ఏవీ జరగడం లేదని, ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపిస్తోందని సోషల్మీడియా వేదికగా నాటి అరాచక ప్రతిపక్షం కుట్రపూరితంగా దుష్ప్రచారం మొదలెట్టింది. భారీ భూకుంభకోణాలు జరిగిపోయాయంటూ అబద్ధాల ‘సాక్షి’గా గగ్గోలు పెట్టింది. అభివృద్ధి మినహా.. వేరే దేని గురించీ పట్టించుకోని మన దార్శనికుడు.. ప్రజలపై నమ్మకంతో.. ఈ వ్యతిరేక ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో.. ప్రజలు.. తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి.. అసత్య ప్రచారాలనే నమ్మారు. జైలు పార్టీనే అందలం ఎక్కించారు.
ప్రజలపైకి ఎక్కేసి.. అమరావతిని తొక్కేసి..
ప్రజలిచ్చిన ఆధిక్యంతో అధికార మత్తులో జోగుతున్న జైలు పార్టీ.. తన స్వభావాన్ని తొలిరోజు నుంచే చాటుకుంది. ప్రజలకు చుక్కలు చూపించడం మొదలెట్టింది. అమరావతి నాశనానికి నడుం బిగించింది. నిర్మాణానికి ఏళ్లు పడుతుంది గానీ.. నాశనానికి నిముషాలు చాలు. అదే జరిగిందిక్కడ. అధికారం చేపట్టిన నాటి నుంచే జగన్మోహనుడి ఉగ్ర చూపు పచ్చటి అమరావతిపై పడింది. పనులు జరుగుతున్న రూ. 50 వేల కోట్ల నిర్మాణాలను అడ్డుకున్నారు. ఏదో అవినీతి జరిగిపోయిందంటూ విచారణ సంఘాలను నియమించారు. పతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలనే వల్లె వేయడం మినహా.. ఆ సంఘాలు ప్రత్యేకంగా తేల్చిందేమీ లేదు. చంద్రబాబు నాటిన అమరావతి మొక్క.. పచ్చగా ఎదుగుతూ.. బలంగా వేళ్లూనుకుంటున్న దశలో.. తన వికృత చేష్టలతో అడ్డదిడ్డంగా నరికేసి.. మోడువార్చేశారు జగన్. మూడు రాజధానుల పేరుతో.. అమరావతిని ఎడారి చేసేస్తున్నారు.
తిరగబడ్డ త్యాగమూర్తులు..
జగన్ వికృత చేష్టలపై రాజధాని రైతన్నలు తిరగబడ్డారు. తమ నోటికాడ ముద్ద లాక్కోవద్దని ఆక్రోశించారు. ప్రభుత్వం నుంచి మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే.. రోడ్డెక్కారు. దీక్షలు చేశారు. ప్రభుత్వ లాఠీ దెబ్బలు రుచి చూశారు. మంత్రుల వెటకారపు మాటలను, వెక్కిరింతలను భరించారు. పండుగలు, పబ్బాలు మానుకున్నారు. అమరావతి తర్వాతే అన్నీ.. అనుకున్నారు. పిల్లా పాప, ఆడ మగ అందరూ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. రోజు రోజుకీ వారి పోరాట స్ఫూర్తి పెరుగుతోందే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. వారి ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తోంది. అన్నదాతలకు అండగా నిలుస్తోంది. అమరావతే లక్ష్యంగా.. చేయిచేయి కలిపిన రైతన్నలు.. ఉద్యమాన్ని ముందుకు ఉరికిస్తున్నారు. వారి సంకల్ప బలం ముందు ఏడాది కాలం ఇట్టే గడిచిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సుదీర్ఘ ఉద్యమం సాగుతోంది. అయినా మన దృతరాష్ట్రుడికి కనిపించదు.. వినిపించదు. ఎందుకంటే.. ఆయన లక్ష్యం అరాచకం.. ధ్యేయం వినాశనం. జగనన్న ధృతరాష్ట్ర పాలనలో న్యాయం జరగాలంటే.. రాజధాని బతకాలంటే.. మన అమరావతి రైతన్నకు ప్రతి ఆంధ్రుడి మద్దతు తప్పనిసరి. చంద్రబాబు సారధ్యంలో ఆంధ్రులంతా ఏకమై అరాచక పాలకులపై పోరాడితే తప్ప ఆంధ్ర దేశం మిగలదేమో!
Also Read ;- నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన