(శ్రీకాకుళం నుండి లియో ప్రత్యేక ప్రతినిధి)
పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశంకు కంచుకోటగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు పార్టీ వ్యవస్థాగత విస్తరణలో మరోమారు సముచిత స్థానం లభించింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సిక్కోలుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. పార్టీ పరమైన పదవుల్లో అన్నివర్గాలకూ పెద్దపీట వేశారు. ఇందులో భాగంగానే ఇటీవల టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడును జాతీయ కార్యదర్శిగా నియమించారు. కిమిడి కళా వెంకటరావు, ప్రతిభా భారతిలను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలో 13 మంది సిక్కోలు నేతలకు కీలక స్థానాలు కల్పించారు. ఇటు జిల్లాలోనూ అటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా వీరిని ఎంపిక చేశారు. ప్రత్యర్థి పార్టీకి దీటుగా సమాధానమిచ్చేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. తాజా నిర్ణయం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొన్నటివరకూ జిల్లా అధ్యక్షురాలిగా పార్టీకి సేవలందించిన పలాస నియోజకవర్గానికి చెందిన గౌతు శిరీషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరో ఇద్దరిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంపిక చేశారు. ఇచ్ఛాఫురం నుంచి ఇద్దరు, ఆమదాలవలస నుంచి ఇద్దరు, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, పాలకొండ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా నియమితులయ్యారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తథ్యం : శిరీష
తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా తాను చేసిన కృషికి చంద్రబాబునాయుడు తగిన ప్రాధాన్యం ఇచ్చారని, అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ, తమకు అప్పగించిన బాధ్యతల్ని నిస్వార్థంతో నిర్వర్తిస్తామని కొత్తగా నియమితులైన నాయకులంతా పేర్కొన్నారు.











