తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిదానంగా పాలనాపరమైన అంశాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విషయంలో నియంతలా కాకుండా.. కార్యనిర్వాహక వ్యవస్థకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రభుత్వ అధికారుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల ప్రభుత్వ విధానం ఏంటనేది తాజాగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష చేశారు. దాంట్లో ప్రభుత్వ వైఖరి ఏంటో వారికి స్పష్టం చేశారు. తాము అధికారులకు స్వేచ్ఛ ఇస్తామని, పాలనలో రాజకీయం చొప్పించబోమని తేల్చి చెప్పారు. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని.. అలాగే, ప్రతి ఒక్క అధికారి పని చేయాల్సిందేనని అన్నారు. ప్రస్తుత హోదాల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సీఎస్కు గానీ, డీజీపీకి గాని చెప్పి వెంటనే తప్పుకోవచ్చని.. అలాంటి వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు చెప్పారు. భూకబ్జాదారులు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని.. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సన్బర్న్ షోలపైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. అయితే, సొంత ప్రయోజనాల కోసం పాలనలో రాజకీయం చొప్పించేసి.. అధికారులను ఒత్తిడికి గురి చేయడం కన్నా.. వారిని స్వేచ్చగా ఉంచడానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అభివద్ది చెందడం అంటే నగరంలో ఆకాశహార్మ్యాలు, అద్దాల మేడలు కాదని.. పౌరులకు అనుకూలమైన పాలన ఉండడమే నిజమైన విజయం అనే సూత్రం ఆధారంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్దాల మేడలు కట్టేసి అభివృద్ధి జరిగిందని చెప్పుకొని, నియంతలా వ్యవహరించే పాలకుల వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని అంటున్నారు. అందుకే, చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకం, అవసరమైన పని జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి అధికారులకు సూటిగా చెప్పారు. ప్రజల చేత శభాష్ అనిపించుకోవాలని చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ఉద్దేశాలతో నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితి తేడాగా ఉంటుందని అన్నారు.
అయితే, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బట్టి.. ఇది చంద్రబాబు పాలన తరహాలో ఉందని కొంత మంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కూడా అధికారులపై ఒత్తిడి చేయబోరని, వారి నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. ఇక రేవంత్ వ్యవహార శైలిని చూస్తున్న ఏపీ ప్రజలు మాత్రం.. జగన్మోహన్ రెడ్డి తీరుతో పోల్చుకుంటున్నారు. పైకి నవ్వుతూ కనిపిస్తూ.. లోలోన అహంకారంతో వ్యవహరించే జగన్.. పొరుగు రాష్ట్రంలోని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.