బస్సులు తిరుగుతున్నాయ్… మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయ్… థియేటర్లు మాత్రం ప్రారంభం కావడం లేదు. మరో పక్క ఓటీటీలు, ఏటీటీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయ్. దీని వెనుక మతలబు ఏమిటి తిరుమలేశా? అని ప్రశ్నలు మాత్రం సగటు మానవుడిలో తలెత్తుతున్నాయ్. థియేటర్లు, ఓటీటీలు… అసలు వీటి వెనుక ఏంజరుగుతోంది? ఎవరి లాబీ ఉంది? ఇంకెవరికి లాభం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే లోపే అన్ని రాష్రాల్లో థియేటర్ల ఉద్యమం ఊపందుకునేలా ఉంది. ఓటీటీల మీద ఎగ్జిబిటర్లు గుర్రుగా ఉన్నారు. సినిమా రంగాన్ని ఇంతపైకి తీసుకొచ్చిన థియేటర్ల మీద ఇంత కసి ఎందుకు అని వారు వాపోతున్నారు.
కరోనా నిబంధనలు ఒక్క థియేటర్లకేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల షూటింగులు ప్రారంభమవుతున్నాయిగానీ థియేటర్ల ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఆ థియేటర్ల లో పనిచేసే ఉద్యోగులు కూడా వీధిన పడ్డారు. వారు తినాలి? ఎలా బతకాలి అనే విషయాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. థియేటర్ల మూసివేతను ఓ సాకుగా చూపి ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలను విడుదల చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. హీరోలు కోట్లు కూడబెట్టుకున్నారంటే అది ఎవరి చలువ? దీనికి సినీ పెద్దలు సమాధానం చెప్పాలని కూడా సినీ పరిశ్రమ వ్యక్తులు కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి పెద్దలు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.
‘ఎల్.ఎల్.ఎల్.పి. అనే గ్రూప్ పెట్టి 21 మంది సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. వారు చెప్పిందే వేదం. పబ్లిసిటీని వారు చెప్పినట్లే చేయాలి. చిన్నసినిమాలకూ పబ్లిసిటీని నియంత్రణ చేశారు. దాని వల్ల కేవలం కొన్ని పత్రికలకు మినహా మిగిలిన వారికి ఇవ్వడం సాధ్యపడడంలేదు. అన్నీ తెలిసిన ఛాంబర్ ఎందుకు మౌనం వహించింది? కొందరు చేస్తున్న లాబీయింగ్ వల్ల వారు నోరు మెదపడంలేదు. ఇది ఎంతవరకు సమంజసం? అంటూ ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ నిన్న విరుచుకుపడ్డారు. ఓటీటీ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోందన్నది ఆయన వాదన.
ఓటీటీల తీరుపైనా విమర్శలు
మన తెలుగులో ఉన్నది ఒకే ఒక్క ఓటీటీ ‘ఆహా’. అగ్రస్థానంలో అమెజాన్ ఆధిపత్యం యథావిధిగా కొనసాగుతోంది. థియేటర్ల ప్రారంభంపై స్పష్టత లేకపోవడంతో ఓటీటీల మోనోపలీ స్టార్టయింది. థియేటర్లు ప్రారంభమైనా ఇవి ఏమీ తగ్గేలా లేవు. ఇకనుంచి వ్యూకి ఇంత అని వసూలు చేసే ప్రయత్నాల్లో ఓటీటీలు ఉన్నాయి. ఎందుకంటే థియేటర్లు ప్రారంభమైనా జనం ఆ థియేటర్లకు వస్తారోరారోనన్న సందిగ్ధం ఉంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం థియేటర్లలో 25 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది. దాని వల్ల నిర్మాతలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయాలన్నీఓటీటీలకు తెలుసు కాబట్టి పే ఫర్ వ్యూ పద్ధతిలో వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నాయి. అంటే ఇది కూడా థియేటర్లలో మనం టిక్కెట్ కొనడం లాంటిదేనన్నమాట.
ఈ టీటీ ఇంజెక్షన్ల చికిత్స వల్ల సినిమా రంగానికి ఏం ఒనగూరుతుందోగానీ జనం జేబులు గుల్ల అవడం మాత్రం ఖాయం. పైగా వాటిలో క్వాలిటీ ఏమాత్రం లేనివే కనిపిస్తున్నాయి. ఓటీటీలు ఫరవాలేదుగానీ దానికి ప్రత్యామ్నాయంగా ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లు రంగ ప్రవేశం చేశాయి మరి. అందులో అంతా బూతే. ఆ బూతే రేపు సినిమాకు భవిష్యత్ అనుకుంటున్నారేమో వారికే తెలియాలి. ఏటీటీల ఫార్ములా ఏదో బాగుందని ఓటీటీలు కూడా భావించాయి. ఏటీటీల మీద జనానికి సదభిప్రాయం కలగలేదు. పైగా క్వాలిటీ లేదు. క్వాలిటీ ఉన్న మనం కూడా వ్యూస్ ప్రకారం వసూలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఓటీటీలకు వచ్చింది.
భవిష్యత్ లో ఈ వసూళ్ల రాజాల పర్వం ఇలాగే కొనసాగేలా ఉంది. వీటికి ఓ నియంత్రణ ఉంటే తప్ప పరిస్థితి మారేలా లేదు. జీ నెట్వర్క్ సంస్థ మరో అడుగు ముందుకేసింది. జీ ప్లెక్స్ పేరుతో ఓ ఓటీటీ కి శ్రీకారం చుట్టింది. దీన్నుంచి విడుదలయ్యే సినిమాలను చూడాలంటే ఏటీటీ మాదిరిగా టికెట్ కొనక తప్పదన్న మాట. మొన్న వి సినిమాని అమెజాన్ ప్రైమ్ లో జనం బాగానే చూశారు. మున్ముందు మరిన్ని సినిమాలు ఓటీటీల ద్వారా విడుదల కాబోతున్నాయి. విజయ్ సేతుపతి సినిమా కూడా ఓటీటీలో రాబోతోంది.
విరుమాండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. దీని పేరు ‘కాపే రణరంగం’. అలాగే సూర్య సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాల కోసం ప్రత్యేకంగా మనం డబ్బులు చెల్లించాల్సిందేనట. అక్షయ్కుమార్ ‘సూర్యవంశీ’, రణ్వీర్ సింగ్ ’83’ చిత్రాలను కూడా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూసే ఏర్పాటు రాబోతోంది. భవిష్యత్తులో థియేటర్లు పోయి వాటి స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మరి థియేటర్లు ఏం కావాలి?
కరోనా కారణంగా ఈ తరహా మార్పులు ఇంకా ఏమేం రాబోతున్నాయో అర్థం గావడం కష్టమే. థియేటర్లు మాత్రం కళ్యాణ మండపాలుగా మారతాయా? మాల్స్ అవతారమెత్తుతాయా? లేదా ఇంకేం జరుగబోతోందన్నది తేలాలి. ఆరు నెలలుగా థియేటర్లు మూతపడటం వల్ల అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. పిఠాపురంలోని ఓ థియేటర్లో ఫర్నిచర్ ను దొంగలు పట్టుకుపోయారట. మరికొన్ని చోట్ల ఎలుకలు దూరి పాడుచేస్తున్నాయట. కరోనా పరిస్థితులు కొంత అదుపులోకి వస్తే సీటింగ్ కెపాసిటీ మార్చాల్సి ఉంటుందని అంటున్నారు.
ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో అర్థంగావడం లేదు. ఇప్పటికే చాలా థియేటర్లు సినిమా రంగంలోని ప్రముఖుల చేతుల్లో ఉన్నాయి. చాలావరకు లీజు పద్దతిలోనే నడుస్తున్నాయి. ఓటీటీల కారణంగా ఇకముందు ఇళ్లే థియేటర్లుగా మారిపోతే ఇక థియేటర్లను ఎవరూ పట్టించుకోరేమో. ఆ మెగా తెరకు ఈ ఓటీటీ సరిపోలుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయంచాలి.
-హేమసుందర్ పామర్తి