తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసన మండలి సభ్యుల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ముందుగా వివిధ జిల్లాలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం పట్టభద్రులను ఓటర్లుగా చేర్చే పని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా పోటా పోటీగా నమోదు చేయిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణా రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు తెరాస నాయకులుతో ప్రతి నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా విపక్షాల మద్దతుతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, వామపక్షాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నిక బరిలో దిగనున్నట్లు సమాచారం. గత శాసన సభ ఎన్నికలలో మహా కూటమి పేరుతో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఇప్పుడు అదే స్ఫూర్తితో తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలలో జత కట్టాలన్నది టీజేఎస్ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లాలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం రెండు స్ధానాలలో తమకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండ రామ్ విపక్షాలను కోరుతున్నారు.
విపక్షాలు సహకరిస్తాయా…
టీజేఎస్ చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాల సహకరిస్తాయా అన్నది ప్రశ్నార్దకంగా ఉంది. గత శాసన సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుపై మహా కూటమిలోని ప్రతిపక్షాలు తాత్సారం చేసాయి. ఎన్నికల తేది దగ్గర పుడుతున్న కొద్ది సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రొఫెసర్ కోదండ రామ్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ ఎన్నికలలో మహాకూటమి అభ్యర్ధులు ఓటమిపాలు కావడానికి విపక్షాలు చేసిన ఆలస్యమే కారణమంటూ బహిరంగంగా విమర్శించారు
కోదండరామ్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో సహా ఇతర పక్షాలు అన్నీ ప్రొఫెసర్ కోదండ రామ్ పై ఆగ్రహం వ్యక్తం చేసాయి. అప్పటి నుంచి మహాకూటమిలోని విపక్షాల నాయకులెవ్వరూ కలవ లేదు. కనీసం పలకరించుకున్న పాపాన కూడా పోలేదు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో కలవడం ఎలా సాథ్యం అని అంటున్నారు. అవసరానికి ప్రతిపక్షాలతో చేతులు కలిపే ప్రొఫెసర్ కోదండ రామ్ పట్ల మహాకూటమిలోని విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రొఫెసర్ కోదండ రామ్ కు మద్దతు ఇస్తారా అన్నది అనుమానంగానే ఉంది.
వామపక్షాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్
గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సారి పోటీ చేయాలని భావిస్తున్నారు. వామ పక్షాల అభ్యర్దిగా ఆయన ఎమ్మెల్సీ బరిలో దిగే అవకాశం ఉంది. ఒక వేళ వామ పక్షాలు ఆయన అభ్యర్దిత్వానికి మద్దతు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయవచ్చునని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్ననిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తన అభ్యర్దిత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ వామపక్షాల నాయకులతోను, పట్టభద్రులతోను చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండడంతో ఈ సారి ఎన్నికల మరింత రసవత్తరంగా మారనున్నాయి.