తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వీడియోను మీడియా ప్రతినిధుల వద్ద ప్రదర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేవినేని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ సీనియర్ నేత దేవినేనికి 41ఏ కింద రక్షణ కల్పించాలని, మే 7వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ నెల 29న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు దేవినేని ఉమ హాజరు కావాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేసును విచారించిన ధర్మాసనం మే 7వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వానికి సిగ్గు లేదు
వైసీపీ అరాచక పాలనపై ఏపీ హైకోర్టు 63 సార్లు మొట్టికాయలు వేసినా సిగ్గురాలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఎన్నికేసుల్లో ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టినా ఇంకా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే పిచ్చివాడిగా ముద్రవేసి ఈ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసిందని దేవినేని గుర్తు చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును చివరకు సీబీఐ విచారణ జరిపించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు తలొగ్గి పనిచేయడంతో వారంతా కేసుల్లో ఇరుక్కుపోతున్నారని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Must Read ;- మాజీ మంత్రి దేవినేని అరెస్టుకు రంగం సిద్ధం?