మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ తో సహా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం కోవిడ్ 19 కారణంగా రిలీజ్ అవ్వలేదు. పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. దీంతో ఒకానొక దశలో నిర్మాతలు ఓటీటీ విడుదలకు వెళుతున్నారనే ప్రచారం జరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు హక్కుల కోసం నిర్మాతలను సంప్రదించాయి కూడా. మంచి ధర ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ నిర్మాతలు మాత్రం ఒప్పుకోలేదు.
మంచి ధర వచ్చినా నిర్మాతలు ఓటీటీ విడుదలకు ఒప్పుకోకపోవడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా కాబట్టి సినిమాకు ఓటీటీ ద్వారా కాకుండా ఆలస్యమైనా సరే నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుంటుందని, అప్పుడే పరిచయం గొప్పగా ఉంటుందని చిరు ఓటీటీ విడుదలకు నో చెప్పారని తెలుస్తోంది. నిజమే మరి ఏ కొత్త హీరోకైనా మొదటి సినిమాను థియేటర్లోనే చూసుకోవాలని ఆశపడతాడు. ఎలాగూ అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరుచుకోనున్నాయి కాబట్టి విడుదలకు ఇబ్బందులు తొలగినట్టే. అన్నట్టు ఈ మెగా మేనల్లుడు చిరంజీవి నటించిన శంకర్ దాదా యం.బి.బి.యస్, అందరివాడు సినిమాల్లో కూడా నటించాడు.