గాన గంధర్వుడు బాలు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు ఇప్పుడు ఊపిరిపీల్చుకుంటున్నారు. బాలు క్రమేపీ కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ ప్రకటించారు. దాదాపు 20 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. బాలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకున్న వ్యక్తి ఒకరున్నారు… ఆయనే ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. ఆయన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స కోసం కృషి చేశారట. దేశీయ, విదేశీ వైద్య నిపుణుల వీడియో కాల్ పర్యవేక్షణలో బాలుకు చికిత్స -చిసినట్లు సమాచారం. ఆ చికిత్సకు బాలు స్పందించారు.
అభిమానుల ప్రార్థనలు ఫలించే దిశగా బాలులో కొద్దిపాటి కదలికలు వచ్చాయని, కంటి సైగలను అర్థం చేసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. బాలులో ఈ మాత్రం కదలికలు రావడం వెనుక భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నిరంతర పర్యవేక్షణ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. బాలు ఈ నెల 5న కరోనా బారిన పడ్డారు. 11 వ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఒక దశలో ఆయన ఆరోగ్యం విషమించింది. ఐసీయూ లో వెంటిలేటర్ పై కృత్రిమశ్వాస తో ఉన్నారని ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు.
కరోనా ఇన్ఫెక్షన్ బాలు ఊపిరితిత్తులతో పాటు ప్రధాన అవయవాలను కమ్మేసిందని, రెమిడిసివర్ ఇంజెక్షన్లతో పాటు డెక్సా మిథాసిన్ స్థాయి కూడా దాటి అసలు చేయిదాటి పోయిందని వైద్యులు చేతులెత్తే పరిస్థితి వచ్చింది. విషయం తెలిసిన వెంకయ్య నాయుడు వెంటనే స్పందించారు. ప్రధాని మోడీకి కూడా సమాచారాన్ని ఇచ్చి ఓ ప్రణాళిక రూపొందించారు. దాంతో పీఎంఓ స్పందించింది. ఎంజీఎం వైద్యశాలను ఢిల్లీ లోని ఎయిమ్స్ తో పాటు విదేశాలలోని నిపుణుల బృందాలతో వీడియో కాల్స్ ద్వారా చికిత్స అందించే ఏర్పాట్లను ప్రధాని కార్యాలయం సమన్వయం చేసింది. దీంతో బాలు క్రమేపీ కోలుకోవడం ప్రారంభించారు.
పీఎంఓతో పాటు ఉపరాష్ట్రపతి కార్యాలయం రోజూ మోనిటర్ చేస్తుండడం తో వైద్యులు ప్రత్యేక దృష్టిని పెట్టినట్టు సమాచారం. బాలు నడుము కింది భాగం పూర్తిగా వైద్యానికి స్పందించడం లేదని విదేశీ వైద్యుల బృందం గుర్తించింది. అందుకోసం ప్రత్యేకంగా ఉండే 5 కోట్ల విలువైన ఒక ఫిజియోథెరోఫీ యంత్రాన్ని కొనుగోలు చేయాలని ఎంజీఎం వైద్యశాలకు సూచించింది. ఎంజీఎం వైద్యశాల యాజమాన్యం కూడా అది తర్వాత ఎవ్వరికీ పనికిరాకపోయినా కేవలం బాలు కోసం దాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
అయితే అలాంటివి వెంటనే అందుబాటులో లేకపోవడం, విదేశాలనుంచి తెప్పించినా కనీసం ఆరు వారాలు సమయం పట్టే పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో పాలుపోక ఎంజీఎం యాజమాన్యం ఆలోచనలో పడింది. ఈ యంత్రం దక్షణభారత దేశం మొత్తంలో కేవలం ఒక్క చెన్నై అపోలో లోనే ఉంది. విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి అపోలో గ్రూప్ వైద్యశాలల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డితో మాట్లాడారట. ఫిజియోథెరఫీ యంత్రాన్ని బాలు వైద్యం కోసం కొన్ని రోజులపాటు అపోలో నుంచి ఎంజీఎంకి తరలించాలని కోరారట.
దీనికి ప్రతాప్ సి రెడ్డి కూడా స్పందించి యంత్రాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించడానికి అంగీకరించారు. ప్రస్తుతం బాలుకు వైద్యం ఈ యంత్రం ద్వారా కూడా అందుతోంది. మరో రెండు రోజుల్లో బాలు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి కూడా బాలు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మనం గిర్వించాల్సిన విషయం. తన అభిమానగాయకుడు, కుటుంబానికి సన్నిహితుడు, తమ జిల్లావాసి కూడా కావడం వల్లనేమో వెంకయ్యనాయుడు ఇంత శ్రద్ధతీసుకున్నారు.