రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారితీస్తోందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని, ఇలాంటి వాటి కారణంగా ప్రజాస్వామ్యం నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని భవిష్యత్తులో నాయకులు కావాలనుకునేవారు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకమన్న ఆయన… మన నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి జనాలను ప్రభావితం చేస్తాయని, జీవితంలో విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుందన్నారు.
కృష్ణ జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన ప్రజానాయకుడు స్వర్గీయ పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో పిన్నమనేని చేసిన కృషి, ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు వారు చేపట్టిన కార్యక్రమాలు నేటికీ ఆదర్శనీయమైనవన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు వారు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
మనకు అప్పజెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్న విషయాన్ని వారి జీవితం తెలియజేస్తుందన్నారు.రాజకీయాల్లో విలువలు, నైతికత తగ్గిపోతున్నాయన్న ఆయన, ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులుంటాయోనని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ నాయకులు తమ హోదాకు, స్థాయికి తగినట్లుగా విమర్శలు, రాజకీయ ప్రకటనలుండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి విమర్శల కారణంగా ఆయా పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. పార్టీ మారే రాజకీయనాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారడంతో పాటు పదవిని త్యగించే విధంగా మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక అధికారమే పరమావధిగా ఇటీవలి కాలంలో రాజకీయపార్టీలు ఇస్తున్న ఎన్నికల హామీలు, ప్రణాళికల విషయంలో నిబద్ధత కనిపించడం లేదని వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఏ స్థాయిలో ఉన్న ప్రభుత్వమైనా సరే తమ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇస్తున్న హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు అవసరమని ఆయన సూచించారు. బాధ్యతారహితమైన, ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడంతోపాటు ఆర్థిక భారం పెరుగుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.











