మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు,విశాఖ టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ ఈ రోజు విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురి సమక్షంలో వైసీపీలో చేరారు. విజయసాయిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ పాలన చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు తమకు కొన్ని ప్రతిపాదనలు పంపారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆమోదం తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా,గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Also Read : వైసీపీలోకి గంటా : తనయుడి చేరిక, తండ్రి తెరవెనుక!