వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు నడుము లోతు బురద నీటిలో దిగి ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించాల్సింది పోయి.. అధికార పక్షాన్ని ఎక్కడ ఇరికిద్దామా అనే ఉద్దేశంతోనే వ్యవహరించారు. ఆహారం, నీరు సక్రమంగా అందుతుందా? అని ప్రజల నుంచి తెలుసుకొని, ఒక వేళ తమకు ఏ సాయం అందడం లేదనుకుంటే అప్పుడు పాలకపక్షంపై విమర్శలు చేయొచ్చు. కానీ, జగన్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందడం లేదు కదా..? ఇంత వరకూ మీ కోసం ఎవరు రాలేదు కదా..? అంటూ ప్రశ్నలు వేశారు. కనిపించిన ప్రతి వారిని ఇదే విధంగా జగన్ ప్రశ్నలు అడిగారు.
దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ‘ఏమమ్మా మీకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా..? అని జగన్ విజయవాడలో సింగ్నగర్లో పర్యటిస్తున్న సందర్భంగా ఓ మహిళను అడిగారు. దీంతో ఆమె జగన్ కు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది. ప్రతి ఇంటి దగ్గర పీకల్లోతుదాకా నీళ్లు ఉన్నాయని.. వాళ్లయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారని పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడారు. కొంతమందికి సరకులు పంచారని.. నీళ్లలో మునుగుతూనే తమ వద్దకు వచ్చి.. తమను పడవలో ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారని అన్నారు. దీంతో జగన్ షాక్ అయ్యారు.
విజయవాడ నగరంలోని సింగ్నగర్ లో జగన్ పర్యటించిన సందర్భంగా ఆయనకు ఇలాంటి అనుభవాలే అన్నీ ఎదురయ్యాయి. ఇంకో మహిళ మాట్లాడుతూ.. తమకు ఆహారం సమయానికి అందుతుందని చెప్పారు. తిండి తినే విషయంలో అబద్ధాలు ఆడొద్దని తమకు మాత్రం ఆహారం, మంచినీరు బాగానే అందుతుందని చెప్పుకొచ్చారు. దీంతో జగన్కు కావాల్సిన సమాధానాలు ప్రజల నుంచి రాకపోయేసరికి ఆయన అవాక్కవ్వాల్సి వచ్చింది.
అయినప్పటికీ తాను ముందుగా అనుకున్న స్క్రిప్టును జగన్ మీడియా ముందు అప్పజెప్పేశారు. విజయవాడలో వరద ముంపునకు మానవ తప్పిదమే కారణం అని అర్థం లేకుండా ఆరోపణలు చేశారు. ముంపు ప్రాంతాలకూ హెచ్చరికలూ చేయలేదు… అందుకే లక్ష మంది ప్రజలు ముంపునకు గురయ్యారు.. ఇప్పటి వరకు బాధితులకు కనీస అవసరాలు కల్పించలేదు.. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.. అంటూ విమర్శలు చేశారు. నిజానికి అవన్నీ ప్రభుత్వం సమర్థంగా చేసినవే. పైగా బుడమేరు గేట్లు ఎత్తారని జగన్ చెబుతుండగా.. దాన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు బుడమేరు వాగుకు గేట్లు ఎప్పుడు పెట్టారు..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జగన్ తన బురద పర్యటన సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి స్పందన వస్తుందని అనుకున్నారు. కానీ, చెంప మీద కొట్టినట్లుగా జనం నిజాయతీగా ఉండేసరికి జగన్ నిరుత్సాహపడినట్లుగా చెబుతున్నారు.