నిజమే… విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు బలిపీఠంపై ఉన్నట్లే లెక్క. అయితేనేం… తన గొప్పతనమేమిటో క్షణాల్లోనే చెప్పేసింది. కరోనా కాలంలో తన కష్టాలను ఇట్టే పక్కన పెట్టేసి యావత్తు దేశానికే కన్నతల్లిలా మారిపోయింది. కరోనా పీడ దినాల్లో ప్రాణ వాయువు కరువై దేశం అల్లాడిపోతుంటే… తానున్నానంటూ… ఎంత కావాలంటే అంత ప్రాణ వాయువును సరఫరా చేస్తానంటూ రంగంలోకి దిగిపోయింది. తెలుగు ప్రజలకే కాకుండా యావత్తు దేశ ప్రజలకు ప్రాణవాయువు ఆక్సిజన్ను అందించే పనిలో ఇప్పుడు విశాఖ ఉక్కు తనదైన శైలిలో రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. నిజంగానే అమితాసక్తి కలిగిస్తున్న విశాఖ ఉక్కు గొప్పతనం ఏమిటన్న వైనంపై మనం కూడా ఓ లెక్కేద్దాం పదండి.
దేశ అవసరాల కోసం నడుం బిగించిన విశాఖ ఉక్కు..
ప్రాణాంతక వైరస్ కరోనా… తన ప్రతాపాన్ని తగ్గించేసిందే అనుకుంటున్న తరుణంలో తన రెండో రూపంతో విరుచుకుడింది. గతంలో కంటే కూడా రెట్టింపు కేసులతో దేశాన్ని వణికిస్తోంది. రోజుకు దాదాపు 2లక్షల కొత్త కేసులతో భారత్లో కరోనా నిజంగానే విలయ తాండవం చేస్తోంది. తొలి వేరియంట్ సందర్భంగా కరోనా సోకిన వారికి ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ అంతగా అవసరం పడలేదనే చెప్పాలి. అయితే సెకండ్ వేరియంట్ తనదైన శైలి ప్రతాపం చూపిస్తూ… ప్రాణ వాయువు ఆక్సిజన్ లేకుంటే చావే గతి అన్న రీతిలో పేట్రేగిపోతోంది. ఇలాంటి తరుణంలో కొత్తగా వెల్లువెత్తుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడం దుస్సాధ్యంగానే మారిపోయింది. అయితే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో తనకంటూ ఓ అరుదైన నేపథ్యం కలిగిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు) కర్మాగారం ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చేసింది. ఏ ఒక్కరి పిలుపు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన విశాఖ ఉక్కు దేశ అవసరాల కోసం ఎంత మేర అయినా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను అందజేస్తానంటూ రంగంలోకి దిగిపోయింది.
చాలా రాష్ట్రాలకు ఇక్కడ నుంచే..
ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే… ఏపీలో కాస్తంత తక్కువ కేసులే నమోదవుతున్నా… పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కరోనా బారిన పడినవారంతా ఆక్సిజన్ అందక నానా యాతన పడుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందకుంటే… ప్రాణాలే విడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాను కార్యకలాపాలు సాగిస్తున్న ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అవసరమైనా సరఫరా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విశాఖ ఉక్కు చడీ చప్పుడు లేకుండానే సంకేతాలు ఇచ్చేసింది. ఇంకేముంది… విశాఖ ఉక్కును నిర్దాక్షిణ్యంగా తెగనమ్మేయాలని భావించిన నరేంద్ర మోదీ సర్కారు విశాఖ ఉక్కు నుంచే ఆక్సిజన్ను తీసుకోవాలని తీర్మానించింది. అంతేకాకుండా ఇప్పటికే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అవసరాల కోసం ట్యాంకర్ల కొద్దీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తరలించుకుని వెళ్లారు. తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కూడా అవసరమైన మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తరలించేందుకు మోదీ సర్కారు సన్నాహాలు మొదలెట్టేసింది.

ఆక్సిజన్ రైళ్లు ఎన్ని వచ్చినా..
ఈ సన్నాహాల్లో భాగంగా… నవీ ముంబైలోని కలంబోళీ గూడ్స్ యార్డ్ నుంచి ఏడు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఇప్పటికే విశాఖకు బయలు దేరింది. మంగళవారం రాత్రికి ఆ ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. వసై రోడ్, జల్గావ్, నాగ్పూర్, రాయ్పూర్ జంక్షన్ మీదుగా రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా ఈ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు చేరుకుంటుంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను నింపుకొని మళ్లీ.. ముంబైకి తిరుగు ప్రయాణమవుతుంది. అంతేకాదండోయ్… ఇలాంటి ఆక్సిజన్ రైళ్లు ఎన్ని వచ్చినా గానీ క్షణాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను నింపేసి పంపే సామర్థ్యం విశాఖ ఉక్కు సొంతం.
ఆపత్కాలంలో యావత్తు దేశానికే..
ఆపత్కాలంలో యావత్తు దేశానికే ప్రాణదాతగా, కన్నతల్లిగా మారిపోయిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. అయితే… కరోనా పీడదినాల్లో దేశానికి అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేసే విషయంలో మాత్రం విశాఖ ఉక్కు ఈ విషయాలన్నింటినీ పక్కన పడేసి ప్రాణ దాత అవతారం ఎత్తేసింది. కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో మెడికల్ ఆక్సిజన్దే కీలక భూమిక. అలాంటి మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో విశాఖ ఉక్కుకు అరుదైన రికార్డే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇందు కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్లో కొంత భాగాన్ని బయటి అవరాల కోసం కేటాయిస్తుంటారు. కేంద్రం ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచింది. రోజుకు150 టన్నుల మేర ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది కూడా..
గత ఏడాది కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంలో స్టీల్ ప్లాంట్ కీలకపాత్ర పోషించింది. గత ఏడాది ఈ స్టీల్ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది. అప్పట్లో ఇప్పుడున్నంత డిమాండ్ ఏర్పడలేదు. ఈ సారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. గత ఏడాది గరిష్ఠ సంఖ్యతో పోల్చుకుంటే రెండు రెట్లు అధికంగా కరోనా కేసులు రికార్డవుతున్నాయి. దీంతో ప్రస్తుతం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించి విశాఖ ఉక్కు రాత్రింబవళ్లు పని చేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు సమ్మెలో ఉన్న కార్మికులు దేశం పరిస్థితిని గమనించి వెనువెంటనే విధుల్లో చేరిపోయి ఆక్సిజన్ ఉత్పత్తిలో తలమునకలైపోయిన వైనం అమితాసక్తి రేకెత్తించేదే.











