విజయనగరం జిల్లా ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ వైద్య కళాశాల. గత ప్రభుత్వ హయాంలో విజయనగరానికి సమీపంలోని చెల్లూరు లెప్రసీ మిషన్ ప్రాంగణంలో నిర్మించాలనుకున్నా ఆచరణలోకి రాలేదు. తర్వాత చింతలవలస సమీపంలో మాన్సాస్ స్థలంలో, ట్యాంకు బండ్ రోడ్డులోని పెద్ద చెరువు ఆయకట్టు కింద ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. పట్టణం విస్తరిస్తున్నందున శివారులో కళాశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే తరుణంలో ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రినే విస్తరించి అందులోనే కట్టాలని అనుకున్నారు. భవిష్యత్తు అవసరాలు, జనాభా దృష్ట్యా ఇది కూడా చాలదనుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిపాదన దశలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి ప్రభుత్వం మారి పోయింది. ఆ ప్రతిపాదనలు బుట్ట దాఖలు అయ్యాయి.
వైసీపీ హయాంలో..
వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోమారు విజయనగరం వైద్య కళాశాల ప్రతిపాదన వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఉన్నతాధికారుల సమావేశంలో విజయనగరంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అనడంతో మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. మళ్లీ ప్రతిపాదనలు, స్థల పరిశీలనను స్థానిక అధికారులు చేపట్టారు. అందుకోసం తొలుత కేంద్ర ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి, పక్కనే ఉన్న పీటీసీ స్థలాన్ని కొంత తీసుకోవాలనుకున్నారు. దీనిపై పోలీసు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆ తర్వాత జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కేంద్ర ఆసుపత్రితో పాటు ఏయూ కొండ, జేఎన్టీయూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించి ఎక్కడైతే బాగుంటుందో అందరూ ఆలోచించి నివేదిక పంపించాలని మంత్రి నాని చెప్పారు. ఆ మేరకు మంత్రి బొత్స ఏయూ కొండపై స్థలాన్ని పరిశీలించారు. ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించాక, మిగిలిన 80 ఎకరాలను వైద్య కళాశాలకు అప్పగించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ను ఆదేశించారు. వైద్య కళాశాలకు నిర్మాణానికి నిధులు కూడా కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా జరిగి సుమారు పది నెలలు గడిచినప్పటికీ శంకుస్థాపనకూ నోచుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు తక్షణమే కల్పించుకుని పనులు ప్రారంభానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.











