కరోనా దెబ్బకి ‘2020’ చేదు జ్ఞాపకమే! మహమ్మారి విజృంభణకు ఇక సాధారణ జీవితం గడపలేమనే భావన అందరిలోనూ వచ్చింది. ఉల్లాసం, వినోదం కరవయ్యాయి. కానీ 2021లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి అడుగులు పడుతున్నాయి. అయితే కొవిడ్-19 వార్తలతో విసిగిపోతున్న ప్రజలకు ఒలింపిక్స్ ఎంతో ఊరటనిచ్చే అంశం. కొవిడ్ తో 2020లో వాయిదా పడిన ఒలింపిక్స్ 2021లో జరుగుతాయనే వార్త క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే.. కొత్త స్ట్రెయిన్ వల్ల జపాన్ మళ్లీ అత్యవసర పరిస్థితి విధించింది. ఈ తరుణంలో అసలు ఒలింపిక్స్ జరుగుతాయా? అనే సందేహం జగత్తును వేధిస్తోంది.
కొత్త వర్షన్ తో కొత్త ఆంక్షలు…
కరోనా వైరస్ కొత్త రూపం జపాన్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం కొత్త వర్షన్ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా దేశాలకు విమాన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్ రద్దయ్యే అవకాశం ఉంది. లేదా కొన్నాళ్లు వాయిదా వేసేలా ఉందని ఆ దేశంలో చేసిన సర్వే తెలుపుతోంది.
జపాన్ లో అత్యవసర పరిస్థితి…
జపాన్ ప్రధాని యొషిహిదే సుగ టోక్యోలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా ‘ఎమర్జెన్సీ’ (ఆరోగ్య అత్యవసర పరిస్థితి) విధించారు. అక్కడి అధికార వర్గాల ప్రకారం ఈ అత్యవసర పరిస్థితి వచ్చే నెల దాకా కొనసాగే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితి చూడబోతే.. టోక్యో ఒలింపిక్స్కు తాజా పరిస్థితి అత్యంత విఘాతం కలిగించేలా ఉంది. అన్నింటికి మించి జపాన్లో వ్యాక్సిన్ ట్రయల్స్ మందకొడిగా సాగుతున్నాయి. ఫలితాల విశ్లేషణ కూడా ఆలస్యమే అవుతోంది.
“కరోనా కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయి. వైరస్పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్ నిర్వహణే మా ధ్యేయం. ఒలింపిక్స్ నిర్వహణపై మేమెంత సీరియస్ గా ఉన్నామనేది ప్రపంచానికి చాటి చెప్పేందుకే.. ప్రతిజ్ఞ కూడా చేశాం. కరోనా వైరస్తో సంబంధం లేకుండా 2021 జులై 23నే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయి. క్రీడల్ని సవరించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహిస్తాం.”
– యోషిండే సుగా, జపాన్ ప్రధాన మంత్రి
ఎందుకీ పరిస్థితి?
అంతర్జాతీయంగా పలు దేశాల్లో మహమ్మారిని నియంత్రించేందుకు రోగ నిరోధక టీకా (వ్యాక్సిన్)లొచ్చాయి. భారత్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ జరుగుతోంది. విదేశాల్లో అత్యవసర కేటగిరీ కింద వినియోగం ప్రారంభమైంది. ఇంతటి పురోగతి ఉన్నప్పటికీ కరోనా కొత్త స్ట్రెయిన్ పలు దేశాలను వణికిస్తోంది. అసలీ టీకాలు కొత్త వేరియంట్పై పనిచేస్తాయా అన్న అనుమానాల్ని కూడా రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలన్నీ మళ్లీ లాక్డౌన్ అయిన దుస్థితి. అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ రూటు మార్చుకున్నాయి. అరకొరగానే సాగుతున్నాయి. బ్రిటన్లాంటి దేశాలకైతే అసలు రాకపోకలే సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో విశ్వక్రీడల నిర్వహణపై ఎలా ముందుకు వేళతారు.. అసలు సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.