వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎంగా మారిన తర్వాత ఏపీలో అన్నింటి కంటే కూడా ఇసుక లభ్యత పెను సమస్యగా మారింది. టీడీపీ హయాంలో కొనసాగిన ఇసుక పాలసీని పూర్తిగా మార్చేసిన జగన్ సర్కారు… కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ఇసుక లభ్యతను సులభతరం చేయడం మాట అటుంచితే… సమస్యను మరింత జఠిలం చేసిందనే చెప్పాలి. ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా… రాయలసీమలోని కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో మాత్రం ఇసుక గోల ఓ రేంజిలో సాగుతోంది. ఇసుక గోల ఈ జిల్లాలో అధికార, విపక్షాల మధ్య పెద్ద ఎత్తున గొడవలను సృష్టించడమే కాకుండా అధికార పార్టీకి చెందిన నేతల మధ్య కూడా తగాదాలను పెట్టేసింది. మొన్నటికి మొన్న తాడిపత్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య సాగిన భీకర పోరుకు ఇసుకకు సంబంధించిన ఓ చిన్న వివాదమే కారణంగా నిలిచిన వైనం తెలిసిందే. ఓ వైపున ఇసుక తుఫానులతో అనంత జిల్లా అతలాకుతలం అయిపోతుంటే.. మరోవైపున ఇసుక దొరకక జనం నానా పాట్లు పడుతున్న వైనం ఈ ఒక్క జిల్లాలోనే కనిపిస్తోంది.

తాడిపత్రి దాడికి ఇదే మూలం..
తాడిపత్రి నుంచి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచిన పెద్దారెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక రవాణాను పూర్తిగా హస్తగతం చేసుకున్నారన్న వాదనలు వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తగా… పెద్దారెడ్డి సతీమణి ఇసుక రవాణాకు సంబంధించిన లంచాలు స్వీకరిస్తున్నారన్న కోణంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పోస్టింగ్ పెను వివాదాన్నే సృష్టించింది. సదరు పోస్ట్ పెట్టిన వ్యక్తి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటిలో పనిచేస్తున్నారని, జేసీ ఇంటి నుంచే సదరు పోస్ట్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందన్న ఆరోపణలతో పెద్దారెడ్డి ఊగిపోయారు. జేసీ ఇంటిలో లేని సమయంలో మందీ మార్బలాన్ని వెంటేసుకుని బయలుదేరిన పెద్దారెడ్డి… జేసీ ఇంటిలోకి చొరబడ్డారు. జేసీ కూర్చునే కుర్చీలో కూర్చుని తనదైన శైలి పైత్యాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా ఆ సమయంలో జేసీ ఇంటిలో ఉన్న పలువురిపై తన అనుచరులతో పెద్దారెడ్డి దాడి కూడా చేయించారు. అయితే జేసీ లేకున్నా.. ఆయన అనుచరగణం పెద్దారెడ్డి వర్గం దౌర్జన్యాన్ని గట్టిగానే తిప్పికొట్టింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న గలాటా రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. ఇక ఇతర నియోజకవర్గాల్లోనూ ఇసుక వివాదంలో అధికార వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా ఇసుక అక్రమ రవాణాలో పట్టుబడ్డ వాహనాలను పోలీసులు ఈజీగానే వదిలేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?
అధికార పార్టీ నేతల్లోనూ..
ఇదిలా ఉంటే… ఇసుక వివాదం అటు వైసీపీ, టీడీపీల మధ్య తగాదాలను రేకెత్తిస్తుంటే… ఇసుక రవాణాలో పై చేయి సాధించేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న యత్నాలు కూడా వైసీపీని అభాసుపాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే రాయదుర్గంలో అక్కడి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యల మధ్య తలెత్తింది. ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా వేదావతి నది నుంచి తరలించి నిల్వకేంద్రాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి ఇసుకను నిల్వకేంద్రం నుంచి తరలిస్తున్నారు. అయితే, ఈ కేంద్రంపై రంగయ్య పెత్తనం చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారులు తన కనుసన్నల్లో ఉండేలా.. తాను చెప్పింది వినేలా.. రంగయ్య చక్రం తిప్పారట. ఫలితంగా స్థానిక ఎమ్మెల్యే అయిన కాపు తన వారికి కూడా ఇసుకను ఇప్పించుకోలేని పరిస్థితి వచ్చిందట. ఇదంతా కూడా రంగయ్య వ్యవహారమేనని.. తన నియోజకవర్గ వ్యవహారాల్లో రంగయ్య పెత్తనం ఏంటనేది కాపు మదనపడిపోతున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఈ తరహా వివాదాలు రచ్చకెక్కాయి.
Also Read ;- చట్టం తనపని తాను చేయడం లేదా.. రెచ్చిపోతున్న ఇసుకాసురులు











