జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా పేరుతో మొదలు పెట్టిన క్రీడా కార్యక్రమంలో అంబటి రాయుడు మిస్ అయ్యారు. కొద్ది నెలల క్రితం క్రికెట్ రంగానికి గుడ్ బాయ్ చెప్పేసి.. రాజకీయాలపై మక్కువతో అంబటి రాయుడు వైసీపీ అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సీటు, లేదా ఎంపీ సీటు ఆశించి ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో అంబటి రాయుడు సొంత జిల్లా గుంటూరు కాబట్టి.. ఆ చుట్టుపక్కల ఏదో ఒక స్థానం తనకు ఇస్తారనే ఆశతో చాలా పర్యటనలు చేశారు. పల్లెలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు అన్న తేడా లేకుండా చాలా ప్రాంతాలు తిరిగారు. కొద్ది రోజులు అలా తిరిగి తిరిగి.. ఏమైందో కానీ, తన మకాంను ఉత్తరాంధ్రకు మార్చారు. అందులోనూ ముఖ్యంగా విశాఖపట్నానికి అంబటి రాయుడు మార్చారు.
అక్కడ ఆడుదాం ఆంధ్రా ప్రారంభానికి ముందు జరిగిన రిహార్సల్స్ మ్యాచుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మంత్రి అమర్ నాథ్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రొగ్రాం అధికారికంగా మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అయితే, ఆడుదాం ఆంధ్ర పోగ్రామ్కు క్రికెటర్ అంబటి రాయుడు దూరంగా ఉండటం ఏపీలో చర్చనీయాంశంగా అయింది. మంగళవారం సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వేళ అంబటి రాయుడు పత్తా లేరు.
గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో అంబటి రాయుడు బాగా తిరగ్గా.. వైసీపీనే ఆయన్ని అలా పర్యటనలు చేయమని చెప్పినట్లుగా కొంత మంది చెబుతారు. అయితే, క్రీడలకు సంబంధించిన ఈ కీలక కార్యక్రమం సొంత జిల్లాలో జరుగుతున్నా కూడా అంబటి రాయుడు డుమ్మా కొట్టారు. ఇప్పుడు అంబటి రాయుడు గౌర్హాజరుపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆడుదాం ఆంధ్రా క్రీడలకు సంబంధించిన కార్యక్రమం కావడంతో అంబటి తప్పక ఉంటారని అందరూ భావించారు. ఆఖరికి అదే జిల్లాకు చెందిన కిడాంబి శ్రీకాంత్ కూడా ఉన్నారు. కానీ, అంబటి రాయుడు మాత్రం లేరు.
సీఎం జగన్ పర్యటన కన్నా ముఖ్యమైన పని ఇప్పుడు అంబటి రాయుడి ఏంటనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆయన గైర్హాజరు కావడం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేకపోవడంతోనే అంబటి రాయుడు వెనక్కి తగ్గారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికి పోతూ ఉండగా.. ఇంతగా వ్యతిరేకత ఉన్నప్పుడు తానింకా ఆ పార్టీని వేలాడుతూ ఉండడం ఎందుకని అంబటి రాయుడు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ ప్రారంభించిన క్రీడల కార్యక్రమానికి డుమ్మా కొట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.