రైతు లేనిదే పూట గడవదు ఈ ప్రపంచానికి. కానీ, తాను పండించిన ఉత్పత్తి ధర నిర్ణయించ లేని వారు బహుశా ప్రపంచంలో రైతులోక్కటే ఉంటారేమో. అసలే అకాల వర్షాలు, కరోనా, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత… ఇలా అన్నింటికీ ఎదురీది మరీ ప్రపంచానికి ముద్ద పెట్టేవాడు అన్నదాత. కానీ నేడు రొడ్డుపైన ఒక అనామకుడిలా ఆందోళన చేస్తున్నాడు. మీరు మమ్మల్ని కాపాడుతున్నదేమీ లేదు.. మరింత నాశనం చేయద్దంటూ వేడుకుంటున్నాడు. పంజాబ్ కు చెందిన రైతులు ఈ నెల 26వ తేదీన తమ నిరసన తెలియజేయడానికి ఢిల్లీ బయలుదేరారు. ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వీరు ఉద్యమించారు.
కదిలిన రైతాంగం
ఒక్కసారిగా రైతుల ఉద్యమంతో కలకలం. పంజాబ్ రైతులు వేల సంఖ్యలో హర్యానాలోకి ప్రవేశించడానికి సరిహద్దులు చేరుకున్నారు. అక్కడి పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. అందులో లాఠీలు జులిపించారు, కానీ రైతు పట్టుదల ముందు ప్రభుత్వం ఓడిపోకతప్పలేదు. వారి ప్రయాణానికి అడ్డుతప్పుకోక తప్పలేదు. హర్యానా దాటి ఢిల్లీ సరిహద్దులకు చేరింది వ్యవహారం. ఇక అక్కడా అదే తంతు. అన్నదాతపై పోలీసుల లాఠీలు విరిగాయి, నీళ్లు గుమ్మరించారు, కానీ వీటికి భయపడితే వాళ్లను అన్నదాతలు అని ఎందుకంటారు? రైతుల మొక్కవోని పట్టుదలకు కేంద్రం ఒక మెట్టుదిగక తప్పలేదు. ఆందోళనలకు అనుమతి ఇచ్చింది. దేశ రాజధాని నడిబొడ్డుకు చేరింది రైతుల ఆందోళన. అంతటితో ఆగలేదు, ఇంకా వస్తున్నారు, వస్తూనే ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఈ ఆందోళన ఆగదంటున్నారు రైతులు.
అసలేమిటి వాళ్ల భయం?
పంజాబ్, హర్యానా రైతుల కథనం ప్రకారం, ఈ చట్టాల వల్ల కనీస మద్ధతు ధర నిర్ణయాధికారాలు కార్పొరేట్ అధికారులు చేతుల్లోకి వెళుతుందనేది వారి ఆందోళన. ఆ కారణంగా, పంట పండించడానికి ఇప్పటికే ఎన్నో బాధలు పడుతున్న రైతుల కష్టానికి కనీస ధర కూడా లభించకుండా పోతుందనేది వారి వాదన. అంతేకాదు, ఇన్నాళ్లు మధ్యవర్తులగా వ్యవహరిస్తున్న వారికి ఆధారం లేకుండా పోతుంది. వారి పరిస్థితి ఏంటనేది వారు లేవనెత్తున్న ప్రశ్న. ఈ కొత్త చట్టాల వల్ల పడిన కష్టానికి కనీస ధర కూడా లభించే అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం అని ఆందోళన చెందుతున్నారు.
రైతుల డిమాండ్లు
ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకోవాలి. అంతేకాదు, చట్ట సవరణను ప్రవేశపెట్టి రైతుల కనీస మద్ధతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు విద్యుత్ బిల్లు 2020 ను వెనక్కు తీసుకోవాలిని వారు కోరుతున్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ పై వస్తున్న సబ్సిడీని కోల్పోతామని వారు భావిస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులకు భారతదేశ రైతు సంఘాలు తమ పూర్తి మద్ధతును ప్రకటించారు.
కేంద్ర నిర్ణయమేమిటి?
దీనిపై కేంద్రం ఇప్పటికే చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించింది. అందుకోసం వారి ఆందోళనలను ఆపి అక్కడి నుండి తరలిపోవాలని తెలియజేసింది. అందుకు రైతులు ససేమీరా అంటున్నారు. ఎటువంటి షరతులు పెట్టకుండా చర్చలకు ఆహ్వనిస్తేనే అంగీకరిస్తామని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేనా, ఢిల్లీ 5 దారులను దిగ్భంధం చేస్తామని హెచ్చరింపు జారీ చేయడంతో కేంద్రంలో ఒక్కసారిగా కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది.
అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ ఆకస్మిక భేటీని ఏర్పాటు చేశారు. రైతుల విషయంలో ఎలా ముందుకెళ్లాలని వారు చర్చించినట్లు తెలుస్తుంది. రైతుల ఆందోళన వెనక ఎటువంటి రాజకీయ హస్తం ఉన్నట్లు భావించలేదని కేంద్రం చెప్పుకొచ్చింది. మరి కేంద్రం తర్వాతి నిర్ణయం ఏం తీసుకోనుందో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.