మొన్నటిదాకా మంగళగిరి అంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట.. ఆ తర్వాత వైసీపీ వరసగా విజయాలు నమోదు చేస్తూ వస్తోంది.. అలాంటి స్థానం నుండి తిరుగులేని మెజారిటీతో విజయం దక్కించుకున్నారు టీడీపీ యువనేత లోకేష్.. మంగళగిరి అంటే టీడీపీకి కొరుకుడు పడని కొయ్య అనే నానుడి నుండి లోకేష్ కోటగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. 2019 ఎన్నికల్లో లోకేశ్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీని ఇచ్చి ఓటమిపాలయ్యారు. ఇంకొకరు అయితే.. ఈ ఓటమితో మంగళగిరిని వదిలి పరారయ్యేవారేమో. అయితే లోకేశ్ అందుకు భిన్నంగా అడుగులు వేశారు. ఓడినా.. గెలిచినా.. తాను మంగళగిరిని వీడేది లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు పార్టీ ఓటమిపాలై కష్టాల్లో పడినా.. లోకేశ్ మాత్రం మంగళగిరిని వీడలేదు. నిత్యం మంగళగిరిలో ఉంటూ అక్కడి జనానికి దగ్గరయ్యారు. ఇంటింటికీ తిరిగారు. తానేంటో చూపించారు. తన వైఖరేమిటో తెలియజేశారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేశారు. రానున్న ఎన్నికలే కాదు.. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇక మంగళగిరిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. ఫలితంగా నిన్నటిదాకా మంగళగిరిలో వైసీపీ నేతలుగా ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు లోకేశ్ జట్టులో చేరిపోతున్నారు. అందులో భాగమే.. మంగళవారం వైసీపీ నేత గంజి చిరంజీవి తన అనుచర వర్గంతో జనసేనలో చేరారు.
వాస్తవానికి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ. ప్రతి ఎన్నికలో వారి ఓట్లే విజయాన్ని నిర్దేశిస్తున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. గతంలో టీడీపీలోనూ కొనసాగిన ఆయన 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హన్మంతరావు కుటుంబం కూడా వైసీపీలోనే ఉండిపోయింది. అంటే.. మొత్తంగా చేనేత సామాజిక వర్గం అంతా వైసీపీలోనే ఉందన్న భావన కలిగింది. ఇదే భావనతో సాగిన వైసీపీ అధినేత జగన్.. మొన్నటి ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని హ్యాండిచ్చేసి మురుగురు ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా మురుగుడు కల్యాణిని బరిలోకి దింపిన జగన్.. మహిళ చేత లోకేశ్ ను ఓడించాలని ప్లాన్ వేశారు. ఓ వైపు జగన్ కుయుక్తులను గమనిస్తూనే సాగిన లోకేశ్.. నేతలు వైసీపీలోనే ఉన్నా.. చేనేతల్లోని మెజారిటీ ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు. జగన్ ప్లాన్ ను చిత్తు చేసి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.
లోకేశ్ సాధించిన విజయంతో చేనేత నేతలు పునరాలోచనలో పడిపోయారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఉత్సాహంతో చురుగ్గానే కదిలిన మురుగుడు ఫ్యామిలీ ఎన్నికలు ముగిసినంతనే అడ్రెస్ లేకుండాపోయింది. సీనియర్ అయిన హన్మంతరావు నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయన కంటే కాస్తంత ముందుగానే జాగ్రత్త పడిన గంజి చిరంజీవి జనసేనలో చేరారు.. ఇక జగన్ అనుంగుడు ఆర్కే నియోజకవర్గంలో తమ ఆటలు సాగవని ఓ నిర్ధారణకు వచ్చి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించడం లేదు. అంటే.. వైసీపీకి ఇప్పుడు మంగళగిరిలో జెండా మోసే నేతే లేరన్న మాట. జగన్ నివాసం ఉంటున్న మంగళగిరిలోనే వైసీపీకి ఈ తరహా పరిస్థితి దాపురించడం నిజంగానే ఆసక్తికరంగా మారింది. వైనాట్ 175 అంటూ జబ్బలు చరుచుకున్న జగన్.. ఇప్పుడు లోకేశ్ కొట్టిన దెబ్బకు తాను నివాసం ఉంటున్న నియోజకవర్గంలో చేతులు ఎత్తేయక తప్పలేదన్న మాట.











